కుప్పంలో మెగా ఫుట్వేర్ క్లస్టర్.. దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ ప్రతిపాదనలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:50 PM
దక్షిణ కొరియా బుసాన్లో హ్వాసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఇంటర్నెట్ డెస్క్, జులై 8 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కొరియా బుసాన్లో హ్వాసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో హ్వాసంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆహ్వానం పలికారు. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపోనెంట్ & మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని లోకేశ్ సూచించారు.

ఏపీలో నెక్స్ట్జెన్ అథ్లెటిక్ ఫుట్వేర్ ఆర్అండ్డీ, ఆసియా-పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. కుప్పం కేంద్రంగా దక్షిణ భారత సమగ్ర ఫుట్వేర్ తయారీ క్లస్టర్కు ప్రతిపాదన చేశారు. తిరుపతిలో విడిభాగాల తయారీ, విశాఖపట్నంలో డిజైన్, లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏపీలో టైర్-1, టైర్-2 వెండర్లతో సప్లయర్ మీట్ నిర్వహించాలని హ్వాసంగ్కు ఆహ్వానం పలికారు. కుప్పంలో రూ.900 కోట్లతో గ్రీన్ఫీల్డ్ నాన్ - లెదర్ ఫుట్వేర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు హ్వాసంగ్ ప్రతినిధులు తెలిపారు.

ఏడాదికి 2 కోట్ల జతల స్పోర్ట్స్ షూల తయారీ లక్ష్యంగా హ్వాసంగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని ప్రతినిధులు వివరించారు. అడిడాస్ సహా గ్లోబల్ బ్రాండ్లకు OEM సరఫరాదారుగా హ్వాసంగ్ ఉండనుందని వెల్లడించారు. తొలి దశలో ఎగుమతులు.. ఆపై దేశీయ మార్కెట్పై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని హ్వాసంగ్ ప్రతినిధులు తెలిపారు.

షూఆల్స్ ఫ్యాక్టరీని సందర్శించిన లోకేశ్
అలాగే బుసాన్లోని షూఆల్స్ స్మార్ట్ హెల్త్కేర్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని మంత్రి లోకేశ్ సందర్శించారు. అధునాతన టెక్నాలజీతో బూట్ల తయారీ ప్రక్రియను పరిశీలించారు. మెడికల్ మాగ్నెటిక్ జనరేటర్లు, స్మార్ట్ చిప్లతో తయారయ్యే షూస్పై ఆసక్తి కనపరించారు. పాదాల ఆరోగ్యానికి ప్రత్యేక వైబ్రేషన్ చిప్ టెక్నాలజీని లోకేశ్ పరిశీలించారు. రక్తప్రసరణ మెరుగుదల, కండరాల అలసట తగ్గించే స్మార్ట్ ఫుట్వేర్ తయారీ గురించి ఆయన తెలుసుకున్నారు.

బూ యంగ్ గ్రూప్.. ఆ యూనిట్ ఏర్పాటు చేయాలి..
‘పాదరక్షలు, షూ లేసులు, మెటల్ హార్డ్వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరెన్నికగన్న బూ యంగ్ గ్రూప్ (Boo Young Group) సీఈవో & ప్రెసిడెంట్ డైరెక్టర్ ర్యాన్ కాంగ్, బిజినెస్ స్ట్రాటజీ & ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో బుసాన్లో సమావేశమయ్యాను. ఆంధ్రప్రదేశ్లో బూ యంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాను. సింగిల్ విండో విధానంలో అనుమతులతోపాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కనెక్టివిటీ సిద్ధంగా ఉన్నాయని వివరించాను’ అని లోకేశ్ ఎక్స్లో పోస్టు చేశారు.

అపెక్స్ – కొరియాతో పెట్టుబడులపై చర్చ..
‘దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్లో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో అపెక్స్ – కొరియా ('Andhra Pradesh External Engagement - Korea') పేరుతో పెట్టుబడిదారుల సహాయక, అనుసంధాన విభాగం (Investor facilitation and outreach cell)ను ప్రారంభించాను. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తిచూపే కొరియా సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య అపెక్స్ కొరియా అనుసంధానకర్తగా పనిచేయనుంది’ అని ఎక్స్లో లోకేశ్ పోస్టు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...
సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు: పవన్ కల్యాణ్
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News