ఏపీ పర్యాటకానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు
ABN , Publish Date - Jul 21 , 2026 | 08:49 AM
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. రాష్ట్రానికి ‘బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్’ అవార్డు వచ్చినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.
అమరావతి, జులై 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి (AP Tourism) మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. రాష్ట్రానికి ‘బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్’ అవార్డు వచ్చినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) వెల్లడించారు. జైపూర్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్ (IWTC) వేదికగా ఈ అవార్డును మంత్రి అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్స్కు కేరాఫ్ అడ్రస్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఏపీలోని అద్భుతమైన బీచ్లు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, లగ్జరీ రిసార్టులు, ఆధునిక మౌలిక వసతులు డెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. ముఖ్యంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ను ప్రోత్సహించే దిశగా అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడం, పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పర్యాటకాన్ని ప్రచారం చేయడం వంటి కార్యక్రమాల ఫలితంగానే ఈ అవార్డు దక్కిందని మంత్రి వ్యాఖ్యానించారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అభివృద్ధికి తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. పర్యాటక రంగంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వివాహ వేడుకలకు అత్యుత్తమ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి, పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు: హోం మంత్రి అనిత
ఆ సమయంలో రూ.40ల జీతానికి పనిచేశా: మంత్రి నారాయణ
అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News