Share News

జగన్ హయాంలో పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:31 PM

జగన్ హయాంలో 913 కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయాయని ఏపీ మంత్రి టీజీ భరత్ తెలిపారు. జగన్ హ‌యాంలో పారిశ్రామిక ప్రగ‌తి ఎలా ఉందో ఆర్బీఐ నివేదిక ద్వారా అర్థమ‌వుతోందని పేర్కొన్నారు.

జగన్ హయాంలో పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి.. మంత్రి టీజీ భరత్ ధ్వజం
AP Minister TG Bharat

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో 913 కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయాయని ఏపీ మంత్రి టీజీ భరత్ (AP Minister TG Bharat) తెలిపారు. జగన్ హ‌యాంలో పారిశ్రామిక ప్రగ‌తి ఎలా ఉందో ఆర్బీఐ నివేదిక ద్వారా అర్థమ‌వుతోందని పేర్కొన్నారు. 2019 నుంచి 2020 సంవ‌త్సరంలో ఏపీలో 16,924 ప‌రిశ్రమ‌లు ఉంటే, 2023 నుంచి 2024కు వ‌చ్చే స‌రికి 16,011 ప‌రిశ్రమ‌లు ఉన్నాయని ప్రస్తావించారు. ఇవాళ(శుక్రవారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి టీజీ భరత్ మాట్లాడారు.


పారిశ్రామిక‌వేత్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..

గుజ‌రాత్, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది కూడా ప‌రిశ్రమ‌లు పెరిగాయని మంత్రి టీజీ భరత్ వివరించారు. జగన్ హయాంలో ఏపీలో పారిశ్రామిక‌వేత్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో పారిశ్రామికదారులు ఏపీ నుంచి వెళ్లిపోతే.. జగన్ అండ్ కో మాత్రం ఎన్నో ప‌రిశ్రమ‌లు రాష్ట్రానికి తీసుకొచ్చామ‌ని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన‌ప్పటి నుంచి ఏపీ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు.


20 ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులకు ఆమోదం..

20 ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులకు క్యాబినెట్ భేటీ ద్వారా తాము ఆమోదించామని మంత్రి టీజీ భరత్ ప్రస్తావించారు. ఐదేళ్లలో 20 ల‌క్షల ఉద్యోగాల క‌ల్పనే తమ ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామని వివరించారు. చంద్రబాబు బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబ‌డులు క్యూ క‌డుతున్నాయని ఉద్ఘాటించారు. తొమ్మిది నెల‌ల్లో దేశంలో వ‌చ్చిన పెట్టుబ‌డుల్లో.. 25 శాతం ఏపీకి పెట్టుబ‌డులు వ‌చ్చాయని వెల్లడించారు. ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్న రాష్ట్రాలు మ‌నకంటే చాలా త‌క్కువ‌గానే పెట్టుబ‌డులను ఆక‌ర్షించాయని పేర్కొన్నారు. వైసీపీ నేత‌ల మాయ‌మాట‌లని ప్రజ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేరని మంత్రి టీజీ భరత్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు, నరసరావుపేట నేతలకు మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు

పోలవరం - నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 27 , 2026 | 04:49 PM