ఆ మేనిఫెస్టోతో వెళ్తే ఒక్క సీటు కూడా దక్కదు.. జగన్పై మంత్రి సంధ్యారాణి సెటైర్లు
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:55 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ అధినేత మావిగన్పై చెప్పే మాటలు నిలకడలేనివని ఎద్దేవా చేశారు.
అమరావతి, జులై 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి (AP Minister Gummadi Sandhyarani) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ అధినేత మావిగన్పై చెప్పే మాటలు నిలకడలేనివని ఎద్దేవా చేశారు. ఈరోజు(ఆదివారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి సంధ్యారాణి మాట్లాడారు. తల్లి, చెల్లిని గెంటేసి చిన్నాన్న హత్య నిందితులపై చర్య తీసుకోలేని వ్యక్తిని మనుషుల జాబితాలో చేర్చలేమని విమర్శించారు.
నిలకడలేని మనిషి, నిలకడలేని మనస్తత్వంతో మాట్లాడుతుంటే ఆయన మాటలను పిచ్చెక్కించిన మాటలంటారని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ తాను పిచ్చోడినని చెప్పుకుంటున్నారా..? లేక ప్రజల్ని అమాయకులను చేద్దామని అనుకుంటున్నారా.. ? అని వ్యంగ్యంగా అన్నారు. పిచ్చితో మాట్లాడుతున్నారో లేక వెర్రితో మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలని సెటైర్లు గుప్పించారు. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినా బుద్ధి రాలేదని.. ఇప్పుడు మావిగన్ మేనిఫెస్టోతో వెళ్తే వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కదని ఎద్దేవా చేశారు.
జగన్ కంటే సీనియర్ నేతలు ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ, ధర్మాన లాంటి వారు గొడ్డలి పార్టీలో ఉన్నారని మంత్రి తెలిపారు. జగన్ నిలకడలేని మాటలతో వైసీపీకి జరిగే నష్టం గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. విశాఖపట్నం రాజధాని అని ఎన్నికలకు వెళ్తే ఆ చుట్టు పక్కల ప్రజలు వైసీపీకి ఎవ్వరూ ఓటేయలేదని విమర్శించారు. జగన్ మాటలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. తన పేరులో గన్ ఉన్నట్లుగానే రాజధాని పేరులోనూ గన్లు, గొడ్డళ్లు ఉండాలనుకుంటున్నారని.. తప్ప మానవ సంబంధాలతో ఆయనకు పనిలేదని మంత్రి సంధ్యారాణి వ్యంగ్యంగా అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News