ఏపీలో మరో 175 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి.. నీట్ విద్యార్థులకు భారీ ఊరట
ABN , Publish Date - Jul 13 , 2026 | 08:51 PM
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
అమరావతి, జులై 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 ఎంబీబీఎస్ సీట్లను (AP MBBS Seats) కేటాయించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Minister Satya Kumar Yadav) ప్రకటించారు. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) సోమవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ (LoP) జారీ చేసినట్లు వెల్లడించారు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు, విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు అదనంగా 75 సీట్లు మంజూరయ్యాయని తెలిపారు.
దీంతో ఏపీలో వైద్య విద్య అవకాశాలు మరింత పెరగనున్నాయని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 505 అదనపు సీట్లు పెరిగినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కూడా 550 అదనపు ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయని చెప్పారు. దీంతో కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కలిపి మొత్తం 1,055 అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు.
ఈ నిర్ణయం వల్ల నీట్(NEET) మెరిట్ విద్యార్థులకు భారీ ఊరట లభించనుందని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50 శాతం సీట్లు అందుబాటులో ఉండటం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఏపీలో వైద్య విద్యా అవకాశాలను విస్తరించడంతో పాటు, భవిష్యత్తులో వైద్యుల కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఈ అదనపు సీట్లతో మరి కొంతమంది విద్యార్థులు తమ వైద్య విద్య కలను సాకారం చేసుకునే అవకాశం పొందనున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు
సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట
Read Latest AP News And Telangana News And National News
And Telugu News