Share News

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 28 , 2026 | 11:06 AM

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగుజాతి సెంటిమెంట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతానని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) తెలుగుజాతి సెంటిమెంట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతానని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) మంగళగిరిలో జరుగుతున్న మహానాడు వేడుకలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు నివాళులు అర్పించారు. 1,875 క్లస్టర్ల నుంచి మహానాడుకు టీడీపీ నేతలు, శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని మహానాడులో ఆయనకు నివాళి అర్పించే తీర్మానంపై సీఎం ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో ప్రతిపాదించారు.


ఎన్టీఆర్‌ అంటే పేదలకు భరోసా..

దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ఎన్టీఆర్‌ను సత్కరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్‌ అంటే పేదలకు భరోసా.. రైతుకు నేస్తమని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటే అన్నివర్గాలు ప్రేమించే నాయకుడని ప్రశంసించారు. సాధారణ ఉద్యోగిగా మొదలై, సినిమా స్టార్‌గా ఎదిగి, ప్రజల కోసం పార్టీ పెట్టి సీఎంగా ఎదగడం ఎన్టీఆర్‌కే సాధ్యమని కీర్తించారు. ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎన్టీఆర్ ఎప్పుడూ వీడలేదని తెలిపారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనేదే ఎన్టీఆర్‌ సిద్ధాంతమని పేర్కొన్నారు.


ఎన్టీఆర్ జయంతి తెలుగువారికి పండుగ రోజు..

తెలుగు జాతి ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ జయంతి తెలుగువారందరికీ పండుగ రోజు అని తెలిపారు. సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి సినీ జీవితంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎదిగారని ప్రశంసించారు. ఎన్టీఆర్ మళ్లీ పుడితే తప్ప ఆయన క్రమశిక్షణ, ఆయన ఖ్యాతి మరెవరికీ సాధ్యం కాదని అన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా తెలుగువారి ఆత్మగౌరవం కోసమే జీవించారని తెలిపారు. రైతుబిడ్డ నుంచి సినిమాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల వరకూ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ పేరు తలుచుకుంటేనే పట్టుదల, ఆత్మవిశ్వాసం వస్తుందని చెప్పారు. ఆయన పేరు తలచుకుని సంకల్పం చేస్తే చాలు దానికి తిరుగు ఉండదన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన లాంటి నాయకుడు మరొకరు లేరని.. ఆయన మొదట సబ్‌రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరారని ప్రస్తావించారు. నీతి నిజాయితీతో ఆయన సినిమాల్లోకి వచ్చారని.. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని.. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించిందని సీఎం చంద్రబాబు తెలిపారు.


యువతకు దిక్సూచి..

ఎన్టీఆర్ పాలన రైతులకు అండ, మహిళలకు భరోసా, కార్మికులకు అభయం.. యువతకు దిక్సూచి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1983లో రాజకీయాల్లో యువతకు ఎన్టీఆర్ అవకాశాలు కల్పించారని ప్రస్తావించారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని.. భవిష్యత్తులో సమర్థ నాయకత్వం ఉండేలా భవిష్యత్తు కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. నిన్నటి మహానాడులో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేశ్ ప్రతిపాదించిన 33 శాతం రిజర్వేషన్‌ను మనమే ప్రారంభిద్దామని తెలిపారు. 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించాలని కేంద్రాన్ని మరోమారు కోరదామని అన్నారు. తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది మన అందరి డిమాండ్ అని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని ఉద్ఘాటించారు. సామాన్యుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రజల మనస్సుల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించారన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం పనిచేసిన మహోన్నత నేత ఎన్టీఆర్ అని ఉద్ఘాటించారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టం, అపూర్వమని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజల మనోభావాలను గుర్తించి ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని తెలిపారు. ఇది మనందరి ఆకాంక్ష, ప్రతీ తెలుగువారి కోరిక అని చెప్పారు. దేశరాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికిన మహోన్నత నాయకుడికి భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్

మహానాడులో లోకేశ్ సంచలన నిర్ణయం... మహిళలకు 33శాతం మహిళా రిజర్వేషన్ల ప్రతిపాదన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 28 , 2026 | 11:28 AM