CM Revanth Reddy VS Modi Govt: బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:41 PM
ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతోందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. యువతకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత తమలోని శక్తిని గుర్తించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
హైదరాబాద్ ఆగస్టు 31, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం (BJP Govt) చేసిన ఓటు చోరీకి వ్యతిరేకంగా తాము దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఉద్ఘాటించారు. ప్రతి భారతీయుడు ఓటు హక్కును కాపాడాలని సూచించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. బీజేపీ యువత హక్కులను కొల్లగొడుతోందని విమర్శించారు. ఇవాళ (ఆదివారం) కేరళ రాష్ట్రంలోని అలెప్పిలో మెరిట్ విద్యార్థులకు అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సీఎం రేంంత్రెడ్డి ప్రసంగంలోని ముఖ్య అంశాలు..
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఎల్లప్పుడూ పేదల పట్ల, అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నారు.
అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున వారు గొంతుకగా నిలుస్తున్నారు.
కేసీ వేణుగోపాల్ తన నియోజకవర్గంతోపాటు కేరళ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ప్రత్యేకించి మహిళలు, పిల్లల న్యాయం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారు.
వేణుగోపాల్ 2006లో ప్రారంభించిన పొంథువల్ (ఎంపీ) మెరిట్ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉంది.
10వ తరగతి, 12వ తరగతి విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ మెరిట్ అవార్డులు ఎంతగానో దోహదపడుతున్నాయి.
ఈ ఏడాది వందశాతం ఫలితాలను సాధించిన 150 పాఠశాలల్లో దాదాపు 3,500లకు పైగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నారు.
దేశంలో విద్యకు, కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉంది.
దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ.
ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
కేరళ రాష్ట్రంలో విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు.
10, 12వ తరగతుల తర్వాత… సున్నా శాతం డ్రాపౌవుట్స్ సాధించడమంటే అందులో ఆశ్చర్యమేమీ ఉండదు.
విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి అని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.
విద్య అన్నది ఒక గొప్ప ఆయుధం. అదే అందరికీ గొప్ప శక్తి.. అని నేను చాలా బలంగా విశ్వసిస్తా.
అలాంటి విద్యకు ప్రాధాన్యతనిస్తున్న దైవ భూమి కేరళ రాష్ట్రం.
తెలంగాణలో విద్యాభివృద్ధికి పెద్దఎత్తున కృషి చేస్తున్నాం.
విద్యకు ఉన్న ప్రాధాన్యత గురించి నేను ప్రతి సందర్భంలోనూ ప్రజలకు చెబుతున్నా.
ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఏది చేసినా విద్య మనకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది.
వచ్చే పదేళ్లలో తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
2047 నాటికి తెలంగాణను మూడో ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిదేందుకు కృషి చేస్తున్నాం.
తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాం.
కేవలం 55 రోజుల్లో తెలంగాణలో 11,055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం.
వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నాం.
ఒక్కో స్కూల్కు రూ.200 కోట్ల ఖర్చుతో 25 ఎకరాల్లో నిర్మించబోతున్నాం.
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాం.
యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.
ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా నియమించాం.
ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేశాం.
ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేసుకుంటున్నాం.
విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపడానికి ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన కేసీ వేణుగోపాల్కు అభినందనలు.
వేణుగోపాల్ తీసుకున్న ఈ చొరవను ప్రతి నియోజకవర్గం, రాష్ట్రం స్పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నా.
విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అగ్రస్థానంలో విజేతగా నిలుస్తున్న కేరళ రాష్ట్రం పట్ల ఒకింత అసూయ కలుగుతోంది.
గత లోక్సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని, ప్రియాంకా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరాను.
కానీ వారు కేరళను తమ ఇంటిగా, తమ నియోజకవర్గంగా, తమ కర్మభూమిగా ఎంచుకున్నారు.
ఈ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నాం.
కేరళ రాష్ట్రానికి ఎన్నికలు రాబోతున్నాయి.
2026లో జరిగే ఎన్నికలు కేవలం కేరళ అసెంబ్లీ ఎన్నికలుగా భావించకండి.
అవి 2029లో దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అవుతాయి.
దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పించారు.
అదే బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ పౌరుల నుంచి ఓటు హక్కును కొల్లగొడుతున్నారు.
2029లో జరుగబోయే లోక్సభ ఎన్నికలు ఈ రెండు శక్తుల మధ్య జరుగబోతున్నాయి.
దేశంలోని యువత ఈ తేడాను గమనించాలి.
21 ఏళ్ల వయసున్న ఐఏఎస్లు జిల్లాలను సమర్థవంతంగా నడుపుతున్నప్పుడు 21 ఏళ్ల వయసున్న యువత ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయకూడదు.
ఆ దిశగా మనం రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది.
యువతకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
యువత తమలోని శక్తిని గుర్తించాలి.
రాజ్యాంగ పరిక్షణ కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ వద్ద ఆర్థిక బలం లేదు... మీడియా మద్దతు లేదు.
కేవలం యువత, యువతలోని శక్తిని నమ్ముకుని కాంగ్రెస్ పోరాటం సాగిస్తోంది.
ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతోంది.
యువత హక్కులను కాంగ్రెస్ పరిరక్షిస్తోందని గుర్తించండి.
2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే సంవత్సరంగా అందరికీ చాటుదాం.
యువతే మా నమ్మకం... మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు.
మీ భవిష్యత్తు కోసం పోరాటం చేయండి. దేశం కోసం పోరాటం చేయండి. మీరంతా ఆ పని చేస్తారని బలంగా విశ్వసిస్తున్నానని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈవో నియామకం.. మంత్రి కొండా సురేఖ కార్యాలయం వివరణ
కాంగ్రెస్లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..
For More TG News And Telugu News