Dharmasthala Fake Missing: అంతా ఫేకే.. ధర్మస్థల ‘మిస్సింగ్ అమ్మాయి’ కేసులో షాకింగ్ ట్విస్ట్..!
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:09 PM
ధర్మస్థల కేసులో మరో షాకింగ్ ట్విస్ట్. తన కుమార్తె అదృశ్యమైందంటూ సుజాత భట్ అనే మహిళ చెప్పినవన్నీ కట్టుకథలే.. అసలు తనకు కూతురే లేదని.. కేవలం వారు చెప్పడం వల్లే అలా చేశానని మహిళ అసలు నిజం వెల్లడించింది.
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక మృతదేహాల ఖననం (Dharamasthala mass burials) అనే వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఈ కేసు అంతటా కలకలం రేపుతోంది. తాజాగా ఈ కేసులో తన కుమార్తె అదృశ్యమైందని చెప్పిన మహిళ యూ-టర్న్ తీసుకుంది. 2003లో ధర్మస్థల ఆలయానికి వెళ్లి తన కూతురు అనన్య భట్ అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బెంగళూరు మహిళ సుజాత భట్ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. వాస్తవానికి తనకు అనన్య భట్ అనే కుమార్తె లేదని.. గతంలో చెప్పిందంతా పూర్తిగా కల్పితమేనని ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ధర్మస్థల (Dharamasthala) కేసులో ఇప్పటికే కీలక వ్యక్తి మాట మార్చగా.. తాజాగా సుజాత భట్ అనే మహిళ మరో షాకిచ్చింది. 2023లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన తన కుమార్తె అనన్య భట్ (Ananya Bhat) అదృశ్యమైందని కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. ఇప్పుడు అదంతా కట్టుకథే అని తేల్చడంతో అధికారులు కంగుతింటున్నారు. గిరీష్ మట్టనవర్, టి. జయంతి అనే ఇద్దరు వ్యక్తులు తనను అబద్ధం చెప్పేలా ప్రేరేపించారని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తన కుటుంబానికి చెందిన భూమిని ధర్మస్థల ఆలయ నిర్వాహకులు అనుమతులు లేకుండా స్వాధీనం చేసుకోవడంతో అనన్య మిస్సింగ్ కథను అల్లినట్లు సుజాత భట్ చెప్తోంది. ఈ పనికి తాను ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని.. ఇది తప్పేనని అంటోంది. ఇదిలా ఉంటే 100కు పైగా మృతదేహాలను ధర్మస్థల ఆలయ పరిసర ప్రాంతాల్లో పాతిపెట్టానని ఫిర్యాదు చేసిన భీమాను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. భీమా ఫిర్యాదు ప్రకారం తవ్వకాలు జరిపినా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుడిని విచారించగా తానిచ్చిన సమాచారమంతా అబద్ధమేనని ఒప్పుకున్నాడు. అతడి స్టేట్మెంట్ రికార్డు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం నియమించిన సిట్ బృందం ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్నంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే జరిగిన తవ్వకాల్లో కీలక ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసులో అసలు వాస్తవాలు ఏంటన్నది ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్ట్.. ముసుగు మనిషి అరెస్ట్..!
Read Latest Telangana News and National News