Godavari Flood Surge Increases: ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. హెచ్చరిక జారీ అయ్యే అవకాశం
ABN , Publish Date - Aug 30 , 2025 | 07:48 AM
అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏండీ ప్రఖర్ జైన్ తెలిపారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగులు నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలు జలమయం అయ్యాయి. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలు.. జలదిగ్బంధంలో ఉన్నారు. వర్షాల ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే.. భయపడుతున్నారు. అయితే వర్ష బీభత్సానికి రహదారులు కొట్టుకుపోయాయి. వాగులు, నదులు, చెరవులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవహిస్తుంది. ఈ క్రమంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతూ.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏండీ ప్రఖర్ జైన్ తెలిపారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగులు నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. కూనవరం వద్ద 18.10 మీటర్లు, పోలవరం వద్ద 11.71 మీటర్లు, ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 7.99 లక్షల క్యూసెక్కులుగా ప్రవాహిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం) మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సహాయక చర్యలకు 6 SDRF బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చారు. కృష్ణానది వరద ప్రవాహం నిలకడగా ఉందని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.98 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుందని వివరించారు. వినాయక నిమజ్జన సమయంలో భక్తులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని ఆయన వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్తో బాలుడి మృతి