క్రమశిక్షణే ఆయుధం.. ఉద్యోగమే లక్ష్యం
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:08 PM
గిరిజన విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేయడానికి.. వారికి ఉత్తమవిద్యను, క్రమశిక్షణతో కూడిన విలువైన జీవితాన్ని అందించడానికి, సైనిక ఉద్యోగాలు సాధించడానికి చక్కని వేదిక వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గిరిజన సైనిక్స్కూల్.
గిరిజన విద్యార్థులకు వరం అశోక్నగర్ సైనిక్ స్కూల్
ఖాకీ కొలువులకు కేరాఫ్ అడ్రస్
దేశ సేవలో 46 మంది అగ్నివీర్లు
ఖానాపురం(వరంగల్): గిరిజన విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేయడానికి.. వారికి ఉత్తమవిద్యను, క్రమశిక్షణతో కూడిన విలువైన జీవితాన్ని అందించడానికి, సైనిక ఉద్యోగాలు సాధించడానికి చక్కని వేదిక వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గిరిజన సైనిక్స్కూల్. ఇందులో సీటు సాధిం చిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉం టుంది. క్రమశిక్షణే ఆయుధంగా.. ఉద్యోగమే లక్ష్యంగా ప్రతీ విద్యార్థి సంపూర్ణ వ్యక్తిగా ఎదిగేందుకు సైనిక్స్కూల్ దోహదపడుతోంది.
అశోక్నగర్లో 1985లో 105 ఎకరాల విస్తీర్ణంలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంతో మంది పేద విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇదే క్రమంలో 2018లో అప్పటి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపి గిరిజన గురుకుల పాఠశాలను గిరిజన సైనిక్ స్కూల్గా అప్గ్రేడ్ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.కోట్లు మంజూరు చేయిం చి అధునాతన వసతులను కల్పించారు. దీంతో గిరిజన సైనిక్ స్కూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం సైనిక్ స్కూల్లో (6వ తరగతి నుంచి డిగ్రీ వరకు) 720 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
అదేవిధంగా బోధన సిబ్బంది 35, బోధనేతర సిబ్బంది 25 మంది విధులు నిర్వహిస్తున్నారు. మొదట్లో అందరు విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు కల్పించేవారు. కానీ, గత రెండేళ్లుగా రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల నుంచే మెరిట్ విద్యార్థుల కు సైనిక్ స్కూల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. సైనిక్ స్కూల్ల్లో 6వ తరగతిలో సీటు సాధించిన విద్యార్థి డిగ్రీ వరకు ఇక్కడే పూర్తిచేయవచ్చు. సీటు సాధించిన విద్యార్థులకు చదువుతో పాటు పోటీ పరీక్షల కోసం రాటుదేలేలా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు.
దీంతో సైనిక్ స్కూల్ విద్యార్థులు ఎంతో మంది ఐఐటీ, ఐఐఐటీ, నీట్, సెంట్రల్ యూనివర్సిటీలలో సీట్లు సాధిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సులభంగా సాధిస్తున్నారు. ముగ్గురు ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు, ముగ్గురు పీడీల పర్యవేక్షణలో విద్యార్థులకు రన్నింగ్, ఈవెంట్స్లలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సైనిక్ స్కూల్కు చెం దిన 135 మంది విద్యార్థులు అంతర్జాతీయ, జాతీ య, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీం తో పాటు ఆగస్టు 15, జనవరి 26న ఢిల్లీలో జరిగే పరేడ్కు ఎంపికయ్యారు.
71 మంది విద్యార్థులకు ఉద్యోగాలు
గిరిజన సైనిక్ స్కూల్కు చెందిన 71 మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాలు సాధించారు. ఇందులో 46 మంది విద్యార్థులు అగ్నివీర్కు ఎంపికై దేశ సేవలో ఉన్నారు. 9 మంది పోస్టల్ శాఖలో, ఐదుగురు పోలీసు కానిస్టేబుల్స్గా, ముగ్గురు నేవీలో, ముగ్గురు సెంట్రల్ పోలీస్ ఫోర్స్లో, ఇద్దరు అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు సాధించారు. ఏటా అగ్నివీర్లో సైనిక్ స్కూల్ విద్యార్థులు డబుల్ డిజిట్లో ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకుంటున్నారు. సైనిక్ స్కూల్ను మరింత బలోపేతం చేసి భవిష్యత్లో గిరిజన విద్యార్థులు మరిన్ని కొలువులు సాధించేలా తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు.
ప్రతీ విద్యార్థిని ఉత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
గట్ల సురేందర్, ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్
ప్రతీ విద్యార్థిని ఉత్తమంగా తీర్చిదిద్దడ మే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. ఖాకీ కొలువుల కు విద్యార్థులను సన్నద్ధం చేయడం ప్రథమ కర్తవ్యం. అంతేకాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సీట్లు సాధించడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నాం. సైనిక్ స్కూల్ విద్యార్థులను డిఫెన్స్లో ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. స్కూల్ నుంచి బయటకు వచ్చిన ప్రతీ విద్యార్థి సమాజానికి మేలు చేసేలా తీర్చిదిద్దుతున్నాం. ప్రభుత్వ సహకారం బాగుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
రాజీవ్ యువ వికాసంపై నీలినీడలు
నియమ నిష్ఠలతో అమ్మవారి సేవలో..
Read Latest AP News And Telangana News And International News And Telugu News