తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబ్బాకలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ABN , Publish Date - Sep 15 , 2026 | 11:09 AM
గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తానా ఫౌండేషన్ ప్రధాన సమన్వయకర్తగా దుబ్బాక పట్టణంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తానా ఫౌండేషన్ ప్రధాన సమన్వయకర్తగా దుబ్బాక పట్టణంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది. దివ్య సుగూర్, అనీశ్ సుందర్, సుందర్ గోపినాథ్ ఈ శిబిరానికి ఆర్థిక సహకారం అందించగా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్య సేవలను అందించింది. గాడిపల్లి ఫౌండేషన్ స్థానికంగా సహకరించింది.

ఈ కార్యక్రమాన్ని తానా న్యూజెర్సీ కోఆర్డినేటర్ సుధీర్ నరేపలుపు, తానా కోశాధికారి రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీశ్ మేక సమన్వయం చేశారు. వర్ష నరేపలుపు వాలంటీర్ కోఆర్డినేటర్గా వ్యవహరించి స్వచ్ఛంద సేవకులను సమన్వయం చేశారు. వివిధ సంస్థలు, వైద్య బృందాలు, స్థానిక ప్రతినిధులను సమన్వయం చేస్తూ ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడంలో వీరంతా కీలక పాత్ర పోషించారు.
ఈ వైద్య శిబిరానికి దుబ్బాక పట్టణంతోపాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అనుభవజ్ఞులైన వైద్యులు, వైద్య సిబ్బంది క్యాన్సర్కు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ లక్షణాలు, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించాల్సిన ఆవశ్యకత, తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ నాయకుడు, గాడిపల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రఘువర్ధన్ రెడ్డి మాట్లాడారు. గ్రామీణ పేద ప్రజలకు సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గాడిపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పేద ప్రజలకు ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, వారికి సాధ్యమైనంత సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటానని రఘువర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు.

అనంతరం తానా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ నల్లూరి, తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు మాట్లాడారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి తోడ్పడే కార్యక్రమాలకు తానా ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ గ్రామీణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మరిన్ని వైద్య, ఆరోగ్య అవగాహన, సేవా కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు.

ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన అనీశ్ సుందర్, దివ్య సుగూర్, సుందర్ గోపినాథ్, వైద్య సేవలు అందించిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, స్థానికంగా సహకరించిన గాడిపల్లి ఫౌండేషన్, వైద్యులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రజలకు తానా నాయకత్వం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.



ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్
అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు
శంషాబాద్లో బస్సు బీభత్సం.. హోటల్ల్లోకి దూసుకెళ్లి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News