హెల్మెట్ లేనివారికి రాఖీ కట్టారు.. పోలీసుల వినూత్న కార్యక్రమం
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:34 PM
హెల్మెట్లు లేని వాహనదారులకు ఎప్పుడూ చలాన్లు వేసే ట్రాఫిక్ పోలీసులు.. నేడు వినూత్న విధానాన్ని ఎంచుకున్నారు. నేడు రక్షాబంధన్ సందర్భంగా ప్రేమతో రాఖీలు కట్టారు.
కామారెడ్డి, ఆగస్టు 28: హెల్మెట్లు లేని వాహనదారులకు ఎప్పుడూ చలాన్లు వేసే ట్రాఫిక్ పోలీసులు.. నేడు రక్షా బంధన్ సందర్భంగా ప్రేమతో రాఖీలు కట్టారు. కామారెడ్డి డీఎస్పీ ఆదేశాలతో పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో రాఖీ పూర్ణిమ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. వివరాల్లోకెళితే...
హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి బొట్టు పెట్టి, రాఖీ కట్టి.. హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ ధరించడం ప్రతి కుటుంబానికీ రక్ష అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదాల బారినపడతారని హెచ్చరించారు. రక్షా బంధన్ నాడు రాఖీ ఎంత రక్షణ ఇస్తుందని విశ్వసిస్తామో.. హెల్మెట్ కూడా నిత్యం అంతే రక్షణను ఇస్తుందని పేర్కొన్నారు. పోలీసులు ఇలా ద్విచక్ర వాహనదారులను ఆపి ఆప్యాయంగా రాఖీ కట్టడం చూసి వాహనదారులు అవాక్కయ్యారు. ఈ రకమైన శైలిలో వినూత్నంగా అవగాహన కల్పించడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవీ చదవండి:
రాజీనా.. రాజీనామానా?.. రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ
థరూర్కు Vs నేపాల్ ‘శశి థరూర్’.. ‘గ్రాండ్ లార్సెనీ’ నుంచి ‘ఎపికారికసీ’ వరకు