రైతులకేదీ భరోసా..!
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:46 AM
ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. యేటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో సుమారు 3.50లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
యాసంగిలో రెండెకరాలకే అందిన నిధులు
ఆపై ఎకరాల నిధుల కోసం ఎదురుచూపులు
ఇక వానకాలం సీజన్కు దిక్కేలేదు
మృగశిర కార్తె ప్రవేశంతో రైతులు పొలం బాట
సాగు పెట్టుబడుల కోసం తండ్లాట
అప్పులు, వడ్డీలతో సతమతం
తొలకరి పలకరించింది. రైతులు దుక్కులు దున్ని తుకాలు వేసుకుంటున్నారు. పెట్టుబడికి ఖర్చులకు డబ్బులు లేక దిక్కు తోచకున్నారు. ప్రభుత్వం అందించే రైతు భరోసా కోసం ఎదురు చేస్తున్నారు.
మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. యేటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో సుమారు 3.50లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2.67 లక్షల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగికి సంబంధించి విడతలవారీగా రెండెకరాలకు మాత్రమే ప్రభుత్వం నిధులు అధించింది. తొలి విడతగా రూ.110 కోట్లు, రెండో విడతగా రూ.56 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. రెండుకి పైగా ఎకరాల భరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 2.65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.220 కోట్లు జమకాగా, పెట్టుబడుల పరంగా కొంత ఉపశమనం కలిగింది. కానీ ఈ సారి సీజన్ ప్రారంభమైనప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఊపందుకున్న పొలం పనులు....
మృగశిర కార్తె ప్రవేశించడంతో జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు దుక్కి దున్నడం, విత్తనాలు సిద్ధం చేసుకోవడం, ఎరువుల కొనుగోలు, నారు మడుల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడంతో పెట్టుబడుల కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
పెరిగిన సాగు ఖర్చులు...
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, వ్యవసాయ యంత్రాల అద్దెలు, కూలీల ఖర్చులు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేసేందుకు రైతులు సిద్దమవుతుండగా, ఒక్కో రైతుకు వేలాది రూపాయల పెట్టుబడి అవసరమవుతోంది. రైతు భరోసా రెండో విడత నిధులు అందకపోవడంతో చాలా మంది రైతులు సహకార సంఘాలు, బ్యాంకులు, ప్రవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలు సకాలంలో అందకపోవడంతో కొందరు అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు.
పంట చేతికి రాకముందే అప్పుల భారంతో రైతన్న చితికిపోతున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో గత పంటల రుణాలు చెల్లించని రైతులు కూడా అనేకమంది ఉన్నారు. ఈ క్రమంలో కొత్త సీజన్ కోసం మళ్లీ అప్పు తీసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పనులు ముమ్మరం చేశారు. చేతిలో నగదు లేకపోవడంతో రైతులు బాకీలపై విత్తనాలు, ఎరువులు తీసుకుంటుండగా, మరి కొందరు బంధువులు, స్నేహితుల వద్ద నుంచి డబ్బులు సేకరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొమురవెల్లి మల్లన్నకు ఇన్చార్జి గ్రహణం!
కాంగ్రెస్ డివిజన్ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?
Read Latest AP News And Telangana News And International News And Telugu News