రూ.200 కోట్ల భూమి 7 కోట్లకే!
ABN , Publish Date - Aug 12 , 2026 | 09:25 AM
‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన టెసరాక్ట్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుపై విచారణ చేయాలి.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
సీఎం సోదరుడికి చెందిన కంపెనీకి కేటాయించిన సర్కారు
ఇదో పెద్ద స్కాం.. భూముల కేటాయింపుపై విచారణ జరపాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన టెసరాక్ట్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుపై విచారణ చేయాలి. ఒక్క ఉద్యోగీ లేని.. కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఏర్పా టు చేసిన కంపెనీకి రూ.200కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారు!? కంపెనీ వివరాలు, దాని మూలధనం, ఉద్యోగుల సంఖ్య, కార్యాలయ చిరునామా, కంపెనీ చైర్మన్ వ్యవహారం, ప్రభుత్వ భూమి కేటాయింపు తదితర అంశాలను పరిశీలిస్తే.. భారీ కుంభకోణం జరిగిందని స్పష్టంగా అర్ధమవుతోంది.
ఇది రాష్ట్రంలో జరిగిన అతి పెద్ద భూ కేటాయింపు అక్రమాల్లో ఒకటని అనుమానిస్తున్నాం’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొండల్ రెడ్డి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో టెసరాక్ట్, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు తానే బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారని, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో టెసరాక్ట్ పని చేస్తున్నట్లు పేర్కొంటూ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా కాన్సల్ జనరల్ కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. యూఎ్స-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్గా కొండ ల్ అనుముల చేరినట్లు ఆ సంస్థ ప్రకటించిందన్నారు.
కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న ఫోన్ నంబరు 123456789గా ఉందని తప్పుబట్టారు. పటాన్చెరు ప్రాంతంలో ఒక చిన్న చిరునామాను కార్యాలయంగా చూపిస్తున్నారని అన్నారు. ‘‘ఈ కంపెనీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. దాని విలువ రూ.200 కోట్లు. కానీ, ఆ భూమిని గజానికి రూ.3,700 చొప్పున సుమారు రూ.7 కోట్లకే కేటాయించినట్లు మాకు సమాచారం ఉంది. ఇది స్కామ్ కాదా!?’’ అని ప్రశ్నించారు. భూమి కేటాయింపునకు సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.
టెసరాక్ట్ కంపెనీకి, సీఎం సోదరుడికి సంబంధంలేదని మంత్రి శ్రీధర్బాబు చెబుతున్నారని, కొం డల్రెడ్డే స్వయంగా తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో పేర్కొంటే.. సంబం ధం లేదని మంత్రి ఎలా చెబుతారని నిలదీశారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేసేందుకు జరుగుతున్న యత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. పంపులు ఆన్ చేయకుండా యాగాలు చేస్తే నీళ్లు రావని, మానవ ప్రయత్నం కూడా అవసరమన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్లో ప్రకటన చేసినా.. తెలంగాణకు చెందిన ఒక్క ఎంపీ కూడా ప్రశ్నించలేదన్నారు.
రెండు కోట్ల ఓట్లే మిగులుతాయేమో..!
అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ తెలిపారు. ‘‘సర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 3.39 కోట్ల ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియ పూర్తయ్యేనాటికి రూ.2కోట్ల ఓట్లే మిగిలేలా ఉన్నాయి’’ అని అన్నారు. తొలగించిన ఓట్లలో అర్హులైన ఓటర్లను కాపాడుకునేందుకు ఆగస్టు 13, 14 తేదీల్లో కొన్ని సమావేశాలు నిర్వహించి, కేసీఆర్తో చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
మెట్రో ఫేజ్-1 రుణసేకరణ బాధ్యత ఎస్బీఐ క్యాప్స్దే
Read Latest AP News And Telangana News And International News And Telugu News