Share News

3.43 కోట్ల మందికి ‘స్మార్ట్‌’ ఆహార భద్రత

ABN , Publish Date - Aug 12 , 2026 | 08:21 AM

తెలంగాణలో ఆహార భద్రతకు ఇక ‘స్మార్ట్‌’ రూపం రానున్నదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

3.43 కోట్ల మందికి ‘స్మార్ట్‌’ ఆహార భద్రత
Minister N Uttamkumar Reddy

  • ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల ఉచిత సన్నబియ్యం

  • కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొత్తగా 16.32 లక్షల కార్డుల పంపిణీ

  • స్మార్డ్‌ కార్డుల పంపిణీకి 15న సంగారెడ్డిలో సీఎం శ్రీకారం: ఉత్తమ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో ఆహార భద్రతకు ఇక ‘స్మార్ట్‌’ రూపం రానున్నదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శ్రీకారం చుడుతున్నారని, అదే రోజున 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, అడిషనల్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ తదితర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.


సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌తో ఫోన్‌లో మాట్లాడి ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,28,092 ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార భద్రత పరిధిలో ఉన్నారని ఉత్తమ్‌ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ప్రవేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారులకు సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు. 2025 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేసి, వాటి ద్వారా 61,08,544 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కల్పించామని మంత్రి వెల్లడించారు.


రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరిందన్నారు. వాటి ద్వారా 3.43 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆహార భద్రత కార్యక్రమం ఏ స్థాయిలో కొనసాగుతోందో ఇందుకు ప్రభుత్వం చేస్తున్న వ్యయమే నిదర్శనమని చెప్పారు. రేషన్‌ బియ్యం కోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీలో లబ్ధిదారుల గుర్తింపును ధ్రువీకరించి, పారదర్శకతతో కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.


సంగారెడ్డి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లో నిర్వహించేకార్యక్రమాలకు కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపాలని సూచించారు. ఇంత భారీ సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా లబ్ధిదారుల చెంతకు తీసుకెళ్లడమే స్మార్ట్‌ రేషన్‌ కార్డుల లక్ష్యమని ఉత్తమ్‌ పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

మెట్రో ఫేజ్‌-1 రుణసేకరణ బాధ్యత ఎస్‌బీఐ క్యాప్స్‌దే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 08:21 AM