గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ABN , Publish Date - Jun 30 , 2026 | 10:43 AM
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ధర్మపురిలోని పుష్కర ఘాట్లను మంత్రి అడ్లూరి పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గోదావరి పుష్కరాల కోసం ఏడాది ముందుగానే పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
రూ.117 కోట్ల నిధులను కేటాయించాం..
భక్తుల రద్దీ, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి అడ్లూరి చెప్పుకొచ్చారు. ధర్మపురి, కోటిలింగాల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.117 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య వ్యవస్థలు, భక్తుల విశ్రాంతి కేంద్రాల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గత గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయనున్నామని స్పష్టం చేశారు.
అనుభవమున్న కన్సల్టెన్సీలతో పనులు..
రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, అత్యవసర వ్యవస్థలను బలోపేతం చేసి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తామని మంత్రి అడ్లూరి తెలిపారు. పుష్కరాల నిర్వహణలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీల సహకారంతో పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించడమే తమ లక్ష్యమని వివరించారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్
డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News