Share News

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:46 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి గుట్ట మరింత పర్యాటక శోభను సంతరించుకోనుంది.

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ
Nampally Gutta, Vemulawada

  • ఇప్పటికే ప్రత్యేక ఆకర్షణగా కాళీయమర్థనం

  • ఆకట్టుకునే మిడ్‌ మానేరు బ్యాక్‌ వాటర్‌ అందాలు

  • విమానం ఏర్పాటుతో పెరగనున్న పర్యాటకుల రద్దీ

వేములవాడ(రాజన్న సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి గుట్ట మరింత పర్యాటక శోభను సంతరించుకోనుంది. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు మరింత ఆహ్లాదాన్ని, ఆధ్మాత్మికతను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది.


  • ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న కాళీయమర్థనం..

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో కరీంనగర్‌ రోడ్డులో ఉన్న నాంపల్లి గుట్ట భక్తులు, పర్యాటకులతో నిత్యం సందడిగా కనిపిస్తుంది. రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం అప్పట్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు గుట్టపైన కాళీయమర్థనాన్ని నిర్మించారు. ఐదు తలలతో పడగవిప్పి ఉన్న సర్పంపై చిన్ని కృష్ణుడు నృత్యం చేసే రూపాన్ని తీర్చిదిద్దారు. రాజన్నను దర్శించుకున్న భక్తులు నాంపల్లి గుట్టపైకి చేరుకుని లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని కాళీయమర్థనం చూసి వెళుతారు.


xx.jpg

  • విమానం ఏర్పాటుతో పెరగనున్న పర్యాటకుల తాకిడి..

రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరగడంతో నాంపల్లి గుట్టపైన రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వీటీడీఏ పరిధిలో విమానాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ప్రత్యేక వాహనంపై విమానాన్ని నాంపల్లి గుట్టపైకి తరలించారు. విమానాన్ని గుట్టపైన ధర్మగుడం సమీపంలో హైమాస్ట్‌ లైట్‌ సమీపంలో బండరాయిని తొలిచి విమానం విడి భాగాలను బిగించేందుకు పనులు జరుగుతున్నాయి. వచ్చే శ్రావణ మాసంలోగా విమానం ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు పనుల శరవేగంగా చేస్తున్నారు. గుట్టపైన విమానం ఏర్పాటు చేయడంతో భక్తులు, పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.


  • ఆకట్టుకునే అందాలు..

ఆకుపచ్చని చెట్లమధ్య బంగారు వర్ణంలో ఆకట్టుకునే కాళీయమర్థనం నృత్యరూపం భక్తులు, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. నాంపల్లి గుట్టపై నుంచి ఉత్తరం వైపు చూస్తే మూలవాగు, పట్టణ వ్యూ కనువిందు చేస్తాయి. దక్షిణం వైపు మానేరు వాగు అందాలతో పాటు పచ్చని తివాచీ పరుచుకున్నట్లు కనిపించే పల్లెగుట్టల అందాలు ఆకట్టుకుంటాయి. గుట్టపైన తూర్పు భాగంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు, మిడ్‌ మానేర్‌ బ్యాక్‌ వాటర్‌ అందాలు, మూలవాగు, మిడ్‌ మానేరు కలిసే ప్రాంతం చూపరులను ఆకట్టుకుంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలి

శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం.. క్యాన్సర్ బాధిత బాలిక మృతి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 01:46 PM