Share News

ధరణి పోర్టల్ అక్రమాలపై తెలంగాణ సర్కార్ సీరియస్.. సమగ్ర విచారణకు రంగం సిద్ధం

ABN , Publish Date - Jul 07 , 2026 | 06:55 PM

ధరణి పోర్టల్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ధరణి పోర్టల్ అక్రమాలపై తెలంగాణ సర్కార్ సీరియస్.. సమగ్ర విచారణకు రంగం సిద్ధం
Dharani Portal

హైదరాబాద్, జులై 7 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో (Dharani Portal) జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విజిలెన్స్ విభాగం ద్వారా లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి విచారణ జరిపించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెలుగులోకి వస్తున్న అక్రమాలపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమి యజమాని వేలిముద్ర, ఓటీపీ ధ్రువీకరణ లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. భద్రతా వ్యవస్థలను బైపాస్ చేస్తూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను వినియోగించి లావాదేవీలు నిర్వహించినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.


అంతేకాకుండా విదేశాల్లో ఉన్న భూ యజమానులకు తెలియకుండానే వారి పేర్లలో మార్పులు చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్‌లో జరిగిన సుమారు రూ.8 లక్షల లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ పరిశీలనలో దాదాపు 22 వేల రిజిస్ట్రేషన్లలో తేడాలు ఉన్నట్లు సమాచారం.


అలాగే ‘ఘోస్ట్ ఐడీలు’ ఉపయోగించి లక్షల ఎకరాల భూ రికార్డులను మార్చినట్లు ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారింది. కొందరు సిస్టమ్‌లోని టైమ్ క్లాక్‌ను మార్చి పాత తేదీలతో రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సంస్థ నిర్వహించిన పరిశీలనలో ఈ అంశాలు బయటపడినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడం, భూ రికార్డుల భద్రతను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ధరణి పోర్టల్‌కు సంబంధించిన ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం చేపట్టబోయే విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్.. తెలంగాణకు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి: మంత్రి పొంగులేటి

కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి సీతక్క ఎద్దేవా

Read Latest Telangana News And And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 07:01 PM