మహిళలకు రక్షణ కల్పించడంలో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాం: డీజీపీ శివధర్ రెడ్డి
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:39 PM
మహిళల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా ఘటన జరిగితే మనకెందుకులే అనే వైఖరీ మారాలని సూచించారు.
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivdhar Reddy) వ్యాఖ్యానించారు. ఏదైనా ఘటన జరిగితే మనకెందుకులే అనే వైఖరీ మారాలని సూచించారు. మహిళా భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమాన్ని హైదరాబాద్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఈరోజు (శనివారం) నిర్వహించారు. ‘మహిళల రక్షణలో పురుషుల బాధ్యత’ అనే లక్ష్యంతో తెలంగాణ మహిళ భద్రత విభాగం ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ చారు సిన్హా, TGCSB డైరెక్టర్ శిఖా గోయల్, సినీ నటుడు సాయి దుర్గా తేజ్, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘స్టాండ్ విత్ హర్’ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు. మహిళల భద్రతపై సమాజంలో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మహిళల రక్షణ విషయంలో పురుషులు ముందుకు వచ్చి అండగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. మహిళలకు ఆపద వస్తే వెంటనే స్పందించి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. మహిళలకు భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు. సమాజం కూడా పోలీసులకు సహకరిస్తే మహిళలపై నేరాలను మరింతగా తగ్గించవచ్చని డీజీపీ శివధర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ సమస్యపై సీఎం రేవంత్రెడ్డికి కిషన్రెడ్డి లేఖ
బేగంపేటలో బాంబు కలకలం.. అధికారులు అప్రమత్తం
Read Latest International News And Telangana News And AP News And Telugu News