రెజిమెంట్లో ఆయుధాలు చోరీ చేసింది వీరే.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:25 PM
మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు గురించి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ముందు నుంచి చెబుతున్నదే నిజమైంది. ఈ చోరీకి పాల్పడింది ఇంటిదొంగలేనంటూ ఘటన జరిగిన రోజు నుంచి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చెబుతూ వచ్చింది. చివరికి అదే నిజమైంది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం నాడు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) వెల్లడించిన వివరాల్లో చోరీకి పాల్పడింది రెజిమెంట్ ఉద్యోగులేనని వెల్లడించారు. బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్ఛార్జ్, బుల్లెట్ల విభాగం ఇన్ఛార్జ్ సహకారంతోనే ఆయుధాల చోరీ జరిగినట్లు డీజీపీ తెలిపారు.
నలుగురిని అరెస్టు చేశాం..
ఈ ఆయుధాల చోరీ కేసులో నలుగురిని అరెస్టు చేశామని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. చోరీకి గురైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్ఛార్జ్, బుల్లెట్ల విభాగం ఇన్ఛార్జ్ సహకారంతో.. ఆయుధాల చోరీ జరిగిందని వెల్లడించారు. నిందితుడు నాగర్కర్నూల్ జిల్లా ఉడిమళ్ల వాసి మల్లేశ్ అని తెలిపారు. మహబూబ్నగర్లో రిటైర్డ్ ఆర్మీ అధికారి నివాసంలో.. ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడంలో కృషి చేసిన పోలీసులకు డీజీపీ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆయుధాలు, బుల్లెట్ల మాయం..
గత ఆగస్టు 31వ తేదీన తెల్లవారుజామున బొల్లారంలోని ఆర్మీ హెడ్ క్వాటర్స్ కంపెనీలో ఆయుధాలు దొంగిలించారని డీజీపీ తెలిపారు. ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ నాయక్ గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ ఫిర్యాదుపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఈ విచారణలో 7 తుపాకులు, 13 మ్యాగ్జిన్స్, 4 AK 203లు, 5.56 MMతో పాటు పలు ఆయుధాలను మొదటి బిల్డింగ్ను దొంగిలించారని అన్నారు. రెండో బిల్డింగ్ నుంచి మరికొన్ని ఆయుధాలు, బుల్లెట్లను మాయం చేశారని వెల్లడించారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్, ఎస్వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారణ చేశారని చెప్పారు. మొదటగా ఇన్సైడర్స్ తప్ప బయట వ్యక్తులు ఎవరి ప్రమేయం లేదని తేల్చామని అన్నారు. మొదటి దశ విచారణలో ఎవరూ కూడా విచారణకు సహకరించలేదన్నారు. ఆ తర్వాత అధునాతన ఆయుధాలు ఎవరెవరు వాడుతున్నారనేది గుర్తించామని తెలిపారు.16 మంది రెగ్యులర్గా ఈ ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారుల ప్రకారం.. 54 మంది సెలవులో ఉన్న వారిని గుర్తించామని చెప్పారు. పెన్షన్ ఔటర్స్లో ఏడుగురిని విచారించామన్నారు. ఈ కేసులో డ్రగ్స్ మాఫియా కోణం ఏమైనా ఉందా అని కూడా విచారణ చేశామని పేర్కొన్నారు.
వారిద్దరిని అనుమానించి సమగ్రంగా విచారించాం..
టెక్నీకల్ ఏవిడెన్స్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ రంగంలోకి దింపి విచారణ చేశామని డీజీపీ తెలిపారు. ఈ నెల 7వ తేదీన టాస్క్ఫోర్స్ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు వెళ్లి నాగర్ కర్నూల్లో విచారణ చేపట్టారని అన్నారు. అచ్చంపేటలో మొదటగా ఆయుధాలను గడ్డి వాములో దాచి పెట్టారని.. ఆ తర్వాత 6వ తేదీన మరో గడ్డి వాము నుంచి ఓ మిత్రుడు సహాయంతో ఓ గ్రామంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లారని చెప్పారు. మరి తిరిగి 8వ తేదీన మరోసారి ఆయుధాలను స్థలం మార్చారని అన్నారు. ఈ కేసులో టెర్రరిస్ట్ యాక్టివిటీ కోణంలో కూడా విచారించామని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫాంహౌస్లో కుట్రపై సమగ్ర విచారణ: సీఎం రేవంత్రెడ్డి
సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. సీపీ సజ్జనార్కి ఎంపీ మల్లు రవి ఫిర్యాదు
ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి ఘటన.. బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News