హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్
ABN , Publish Date - Jan 29 , 2026 | 10:09 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సందడి చేశారు సీఎం.
ఇంటర్నెట్ డెస్క్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి(Telangana CM Revanth Reddy) అమె1రికా పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. తన పర్యటనలో భాగంగా సీఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్(HBS)లో భారతీయ విద్యార్థులతో జరిగిన భేటీ.. రాజకీయ, విద్య, ఆర్థిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం..
భారతీయ విద్యార్థుల ప్రత్యేక ఆహ్వానం మేరకు క్యాంపస్ను సందర్శించారు సీఎం. ఈ మేరకు విద్యార్థులతో తన ఆలోచనలను పంచుకున్నారు. సీఎం అమెరికా పర్యటన తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా విదేశాల్లో ఉన్న విద్యార్థులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసేలా ఉంది.
విజయ మంత్రం..
విద్యార్థులతో జరిగిన చర్చా గోష్ఠిలో సీఎం రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. విజయం అనేది అదృష్టం వల్ల రాదని.. నిరంతర కృషి, లక్ష్యం పట్ల స్పష్టత ఉంటేనే సాధ్యమని తన విజయ మంత్రాన్ని విద్యార్థులకు బోధించారు. కెరీర్ ప్రారంభంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎలా అధిగమించాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

రైజింగ్ తెలంగాణ..
విజన్ తెలంగాణను గ్లోబల్ మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ను కేవలం ఐటీ హబ్గానే కాకుండా అన్నిరంగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధిలో అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా పాటిస్తున్నామో చెప్పారు.

యువతే భారత భవిష్యత్తు..
భారతదేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యార్థులు పొందుతున్న ఈ ప్రపంచ స్థాయి విద్య, కేవలం మీ కెరీర్ కోసమే కాకుండా దేశాభివృద్ధికి ఉపయోగపడాలని మార్గనిర్దేశం చేశారు. భారతీయ యువత మేథస్సు ప్రపంచాన్ని శాసిస్తోందని వ్యాఖ్యానించారు.

బ్రాండ్ అంబాసిడర్లుగా విద్యార్థులు..
హార్వర్డ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన అవకాశాల గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి
Read Latest Telangana News And Telugu News