‘సర్’ ప్రక్రియలో తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర: సీఎం రేవంత్రెడ్డి
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:13 PM
‘సర్’ పేరుతో వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): ‘సర్’ పేరుతో వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. గ్రామాల్లో ఉన్నవారి ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. రవీంద్రభారతిలో కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభను ఈరోజు (సోమవారం) నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. తన నియోజకవర్గంలోనే 80వేల ఓట్లు తీసేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
బీజేపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు..
బిహార్, బెంగాల్ విధానాన్ని ఉపయోగిస్తామని.. బీజేపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని సీఎం దుయ్యబట్టారు. ‘సర్’కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఈ ఓట్లతోనే 2029లో మోదీ ఓటమికి పునాది పడుతుందని చెప్పారు. ఓట్ల తొలగింపుపై అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశానికి మోదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని విమర్శించారు. మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.