కొత్త రైళ్లలో గంటల కొద్దీ ప్రయాణం !
ABN , Publish Date - May 22 , 2026 | 08:14 AM
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లను తీసుకు వస్తున్నట్లు ఇటీవల రైల్వేమంత్రి చేసిన ప్రకటనకు, తాజాగా దక్షిణ మధ్య రైల్వే రెండు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లుగా ఇచ్చిన ప్రకటనకు పొంతన కుదరడం లేదు.
చర్లపల్లి నుంచి తిరుపతికి 16గంటలు
భువనేశ్వర్ రైలుకు 23 గంటలు
రెగ్యులర్ రైళ్ల కంటే 4-5 గంటల అదనపు సమయం
దక్షిణ మధ్య రైల్వే తీరుపై ప్రయాణికుల ఆగ్రహం
హైదరాబాద్ సిటీ: గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లను తీసుకు వస్తున్నట్లు ఇటీవల రైల్వేమంత్రి చేసిన ప్రకటనకు, తాజాగా దక్షిణ మధ్య రైల్వే రెండు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లుగా ఇచ్చిన ప్రకటనకు పొంతన కుదరడం లేదు. 300కిలోమీటర్ల వేగం సంగతి అలా ఉంచితే.. 130 నుంచి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే సామర్థ్యంతో అధునాతన రైల్వేలైన్లను నిర్మించామంటున్న రైల్వే అధికారులు గంటకు 50కిలోమీటర్ల కంటే వేగంతో కొత్త రైళ్లను నడపలేమని చేతులెత్తేయడం విడ్డూరంగా ఉంది.
తాజాగా చర్లపల్లి నుంచి భువనేశ్వర్కు ఈ నెల 25న, అటు తిరుపతికి ఈ నెల 29న రెండు కొత్తరైళ్లను దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. చర్లపల్లి నుంచి శుక్రవారం సాయంత్రం 4.20గంటలకు 17444 రైలు తిరుపతికి శనివారం ఉదయంం 7.30కు చేరుతుందని చెబుతోంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం తిరుపతి నుంచి సాయంత్రం 4.30గంటలకు బయల్దేరే 17443 రైలు శుక్రవారం ఉదయం 8.25గంటలకు చర్లపల్లికి చేరుతుందని అధికారులు ప్రకటన జారీచేశారు. దీంతో కేవలం 750 కిలోమీటర్ల ప్రయాణం 15నుంచి 16గంటల వరకు పడుతోంది.
ఆ స్టేషన్లలో హాల్ట్లను మరిచారా.!
చర్లపల్లి-తిరుపతి (వయా పిడుగురాళ్ల, మార్కాపురం)మార్గంలో ఇంతకు ముందు నడిపిన 07001/07002 ప్రత్యేక రైళ్లను తాజాగా రెగ్యులర్ ఎక్స్ప్రెస్లుగా ప్రవేశపెడుతున్నట్లు రైల్వే అధికారులు గురువారం వెల్లడించారు. ఆయా రైళ్లకు గతంలో ఉన్న కొన్ని స్టాపుల గురించి తాజాగా పేర్కొనలేదు. 07001 ప్రత్యేక రైలుకు గతంలో వినుకొండ, దొనకొండ రైల్వేస్టేషన్లలో హాల్ట్ ఉండగా, రెగ్యులర్ ఎక్స్ప్రె్సకు ఆయా స్టేషన్లలో హాల్ట్ల గురించి మరిచిపోయారా లేదా ఉద్దేశపూర్వకంగానే ఎత్తివేశారా అని ప్రయాణికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. హాల్ట్ల విషయమై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, సంబంధిత విభాగం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News