జీతం.. ప్రతి నెలా ఆలస్యం!
ABN , Publish Date - Jul 07 , 2026 | 08:10 AM
ప్రతి నెలా ఒకటో తేదీన రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరేరియం ఉద్యోగులందరికీ జీతాలు, వేతనాలు తప్పనిసరిగా ఒకటో తేదీనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఓయూలో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఇబ్బందులు
ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలనే సర్క్యులర్ బుట్టదాఖలు
హైదరాబాద్: ప్రతి నెలా ఒకటో తేదీన రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరేరియం ఉద్యోగులందరికీ జీతాలు, వేతనాలు తప్పనిసరిగా ఒకటో తేదీనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ ఆదేశాలు అమలు కావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 6వ తేదీ వచ్చినా ఓయూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా ఆలస్యంగానే వస్తున్నాయని వాపోతున్నారు. మిగతా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమయ్యాయని, ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
సర్క్యులర్ బుట్టదాఖలు
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జూన్ 9న జారీ చేసిన సర్క్యులర్లో ప్రతి నెలా ఒకటో తేదీన అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు, వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జీతాల చెల్లింపులో జాప్యం జరిగితే సంబంధిత శాఖాధిపతులు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులపై బాధ్యత నిర్ధారించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాకుండా, ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కూడా జీతాల చెల్లింపులో ఆలస్యాన్ని తీవ్రంగా పరిగణించి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఓయూలో ఆ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు చేయాల్సిన దుస్థితి
‘‘ప్రతినెలా ఆలస్యం చేస్తున్నారు. మాపై ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదు. జీతాలు ఆలస్యం కావడంతో బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాం. ఇంటి అద్దె, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇతర అత్యవసర అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది’’ అని పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
అమ్మేవాడు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News