Mahesh Kumar Goud: మీడియా సంస్థలు అలా చేయడం సరికాదు: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:05 PM
మహిళా ఐఏఎస్ అధికారి గురించి ఓ మీడియా సంస్థ తప్పుడు కథనాలు ప్రసారం చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని అన్నారు.
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని అన్నారు. వాస్తవానికి దూరంగా కథనాలు వస్తున్నాయని ఆగ్రహించారు. ఎంతో కష్టపడితే తప్ప మంత్రులు ఈ స్థాయికి చేరుకోరని.. అలాంటి వారిపై మీడియా సంస్థలు నిరాధారమైన వార్తలను ప్రచురించడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందా? అని ప్రశ్నించారాయన. రాముడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎక్కడిది? అని నిలదీశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగడం మంచిది కాదని హితవు పలికారు. ఓట్ల కోసం దేవుడిని వాడుకోవడం సరికాదని చెప్పుకొచ్చారు మహేశ్ కుమార్ గౌడ్.
శ్వేతపత్రం విడుదల చేయాలి..
‘కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణా యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలి. మేం రెండేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తాం. కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితమయ్యారు. కవిత వ్యవహారంతో కేటీఆర్, హరీశ్రావు బాధపడుతున్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి బాగోతంపై కవిత నిజాలు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తాం, పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలు గెలిచాం. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే తపన ప్రజల్లో కనిపిస్తోంది. పేర్లు మార్చడం వల్ల ప్రజలకు వచ్చేదేమీ లేదు. పేర్ల మార్పునకు ముందు ఆయా జిల్లాలకు ఏమేం చేశారో చెప్పాలి. ప్రజల దృష్టి మళ్లించేందుకే పేరు మార్పు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు’ అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బండ్ల గణేశ్ మహా పాదయాత్ర.. ఎందుకంటే..
టార్గెట్ మున్సిపోల్స్.. బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ..
Read Latest Telangana News And Telugu News