Share News

హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక రుణం.. ఐఆర్‌ఎఫ్‌సీతో కీలక ఒప్పందం

ABN , Publish Date - May 25 , 2026 | 01:53 PM

హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్‌తో హైదరాబాద్ మెట్రో కీలక రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక రుణం.. ఐఆర్‌ఎఫ్‌సీతో కీలక ఒప్పందం
Hyderabad Metro

హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలుకు (Hyderabad Metro Rail) భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్‌తో (ఐఆర్‌ఎఫ్‌సీ) హైదరాబాద్ మెట్రో కీలక రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.13,600 కోట్ల రుణ సదుపాయానికి సంబంధించిన ఈ ఒప్పందంపై ఈరోజు (సోమవారం) ఢిల్లీలో సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సమక్షంలో ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్ మెట్రోకు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూర్చే కీలక అడుగుగా ఈ ఒప్పందాన్ని అధికారులు అభివర్ణించారు.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పట్టణ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎస్ రామకృష్ణ రావు తెలిపారు. హైదరాబాద్ దేశ ఆర్థిక వృద్ధికి కీలక కేంద్రంగా ఎదుగుతోందని, మెట్రో కనెక్టివిటీ విస్తరణతో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఉన్న రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు రూ.13,600 కోట్ల రుణం మంజూరు చేయనున్నారు. నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక చెల్లింపుల విధానంలో ఈ రుణ సదుపాయం ఇవ్వనున్నారు.


రీఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రోపై ఉన్న ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, భవిష్యత్తులో విస్తరణ ప్రణాళికలకు కూడా ఆర్థిక వెసులుబాటు కలగనుంది. మరో కీలక పరిణామంగా, లార్సెన్ అండ్ టూబ్రో (Larsen & Toubro) నుంచి ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్‌ వందశాతం యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ కానుంది. దీంతో హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రధాన ప్రజా రవాణా ఆస్తిగా మారనుంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం, ఐఆర్‌ఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్ మెట్రో రైలు బృందాలకు సీఎస్ రామకృష్ణరావు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌కు సమర్థవంతమైన, సుస్థిరమైన ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎస్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 25 , 2026 | 01:56 PM