Share News

నాంపల్లి అగ్ని ప్రమాదంపై హైడ్రా సీరియస్

ABN , Publish Date - Jan 29 , 2026 | 03:40 PM

నాంపల్లి ప్రాంతంలో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ షాపులో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనను హైడ్రా సీరియస్‌గా తీసుకుంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా హైడ్రా చర్యలు తీసుకుంటోంది.

నాంపల్లి అగ్ని ప్రమాదంపై హైడ్రా సీరియస్
Hydra

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఇటీవల బచ్చాస్ ఫర్నిచర్ (Bacha Furniture) షాపులో జరిగిన భారీ అగ్నిప్రమాదం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు (ఇద్దరు చిన్నారులతో సహా) సజీవ దహనమయ్యారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరుగకుండా చర్యలకు ఉపక్రమించారు.


నాంపల్లిలో విస్తృత తనిఖీలు..

అగ్నిప్రమాదం నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు రంగంలోకి దిగారు. నాంపల్లి ప్రాంతంలోని పలు ఫర్నిచర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అగ్నిమాపక నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎగ్జిట్ మార్గాలను అడ్డుకుంటూ స్టాక్ ఉంచినట్లు గుర్తించారు.


కఠిన చర్యలు..

భద్రతా ప్రమాణాలు పాటించని కొన్ని షాపులను అధికారులు తక్షణమే సీజ్ చేశారు. సెల్లార్లను పార్కింగ్ కోసం కాకుండా గోదాములుగా వాడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.

ప్రజల కోసం హెల్ప్‌లైన్ నంబర్..

అగ్నిప్రమాదాల నివారణలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు హైడ్రా ఒక ప్రత్యేక వాట్సాప్/కంట్రోల్ రూమ్ నంబర్‌ 9000113667ను అందుబాటులోకి తెచ్చింది.


ఏం చేయాలి..?

మీ పరిసరాల్లోని వాణిజ్య సముదాయాలు లేదా షాపుల్లో అగ్నిప్రమాదాలకు కారణమయ్యేలా నిబంధనల ఉల్లంఘనలు ఉంటే (ఉదా: మెట్ల దారిలో సామాన్లు పెట్టడం, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం), వాటి ఫొటోలు లేదా వీడియోలను ఈ నంబర్‌కు(9000113667) పంపించాలని కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.


హైడ్రా హెచ్చరికలు, మార్గదర్శకాలు..

కమిషనర్ రంగనాథ్ వ్యాపార యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెల్లార్లను కేవలం పార్కింగ్ కోసం మాత్రమే వాడాలని దిశానిర్దేశం చేశారు. అక్కడ నిప్పు అంటుకునే వస్తువులు లేదా నివాసాలు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర ద్వారాలు, కారిడార్లు ఎప్పుడూ ఖాళీగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. స్టాక్ పెట్టి దారిని మూసివేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


నిరంతర నిఘా..

ఇకపై కేవలం నాంపల్లిలోనే కాకుండా భాగ్యనగరం మొత్తం మీద ఉన్న వస్త్ర దుకాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లపై ఆకస్మిక తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు. బచ్చాస్ ఫర్నిచర్ ప్రమాదానికి భవన యజమాని నిర్లక్ష్యమే కారణమని గుర్తించిన పోలీసులు, ఇప్పటికే యజమానిని అరెస్ట్ చేశారు. ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా హైడ్రా చేపట్టిన ఈ 'ఫైర్ సేఫ్టీ డ్రైవ్' నగరంలో చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి...

హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్‌

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2026 | 03:54 PM