నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు.. జలమండలి వార్నింగ్
ABN , Publish Date - May 06 , 2026 | 12:50 PM
భాగ్యనగరంలో నీటి సరఫరా వ్యవస్థను దెబ్బతీసే అక్రమ మోటార్లపై జలమండలి విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు చేపట్టింది. కూకట్పల్లి జోన్ పరిధిలోని పలు కాలనీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్రమంగా నల్లాలకు మోటార్లు బిగించిన వారిపై చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో నీటి సరఫరా వ్యవస్థను దెబ్బతీసే అక్రమ మోటార్లపై జలమండలి విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు చేపట్టింది. కూకట్పల్లి జోన్ పరిధిలోని పలు కాలనీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్రమంగా నల్లాలకు మోటార్లు బిగించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 18 మోటార్లను సీజ్ చేశారు.
కూకట్పల్లి జోన్లో స్పెషల్ డ్రైవ్..
జలమండలి విజిలెన్స్ అధికారులు ఈరోజు (బుధవారం) కూకట్పల్లి జోన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బాలాజీ నగర్ వార్డు, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్-1 ప్రాంతాల్లో అక్రమ నీటి వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అధికారుల పరిశీలనలో భాగంగా పైపులైన్లకు నేరుగా మోటార్లు బిగించి నీటిని అక్రమంగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు.
క్రిమినల్ కేసు నమోదు చేస్తాం..
ఇలా నిబంధనలు ఉల్లంఘించిన ఇళ్ల వద్ద నుంచి మొత్తం 18 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. రెండోసారి పట్టుబడితే రూ.5,000 జరిమానా విధిస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నీటి సరఫరా వ్యవస్థను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలకు జలమండలి విజ్ఞప్తి..
నల్లాలకు మోటార్లు బిగించవద్దని జలమండలి అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల ఇతర వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇళ్లలో నీటి సమస్యలు ఉంటే అక్రమంగా మోటార్లు బిగించకుండా జలమండలిని సంప్రదించాలని సూచించారు. లో ప్రెజర్ లేదా నీటి కొరత సమస్యలుంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో పైపులైన్ మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో వేసవి కాలంలో నీటి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా అక్రమ మోటార్లపై తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసుపై సజ్జనార్ స్పెషల్ ఫోకస్
పంజాబ్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. రాఘవ్ చద్దా ధ్వజం
అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పదిమంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News