Share News

సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:57 PM

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. స్కాంలు, కాంగ్రెస్ అరాచకాలతో సింగరేణి సంస్థపై భారం పెరిగిందని విమర్శించారు.

సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు
Harish Rao

హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. స్కాంలు, కాంగ్రెస్ అరాచకాలతో సింగరేణి సంస్థపై భారం పెరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో స్కీంలు లేవు.. కానీ స్కాంలు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. జాబ్ క్యాలెండర్‌ కాదని.. రేవంత్‌రెడ్డి స్కాంల క్యాలెండర్‌‌ను తెచ్చారని ఆక్షేపించారు. ఆంధ్రా నేతలతో రేవంత్‌రెడ్డి చేతులు కలిపి.. నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.


ఆ స్కాంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి..

కాంగ్రెస్‌లో అత్యుత్తమ హోదా పొందటానికి అందరికంటే ఎక్కువ అర్హత ఉన్న నాయకుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కనేనని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. అంతటి అనుభవం ఉన్న భట్టి విక్రమార్క.. రేవంత్‌రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం పనిచేయటం బాధాకరమని పేర్కొన్నారు. సింగరేణి స్కాంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్డితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భట్టి లబ్ధిదారుడా లేదా అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో మంత్రులు రాజీనామా చేసేవారని ప్రస్తావించారు. సింగరేణి ఓబీ వర్క్స్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తెచ్చిందే కాంగ్రెస్‌ అని గుర్తుచేశారు. తనకు లేఖ రాస్తే.. ముఖ్యమంత్రితో మాట్లాడుతానని భట్టి అనటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రేపో, మాపో తమకు మరో ప్రేమ లేఖ(సిట్ నోటీసు) వస్తుందని సెటైర్లు గుప్పించారు.


టెండర్లను రద్దు చేయాలి..

మే 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీ వర్క్స్ కోసం సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తీసుకొచ్చిందని హరీశ్‌రావు ప్రస్తావించారు. ఓబీ వర్క్స్‌లో‌ మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డినేనని ఆరోపణలు చేశారు. నైనీ బ్లాక్ టెండర్లు కాదని.. సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2025 మే నుంచి ఎంతమందికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని బొగ్గు స్కాం నుంచి బయట పడేయటానికి ప్రయత్నం చేసి భట్టివిక్రమార్క విఫలమయ్యారని విమర్శించారు. భట్టి మాటల గారడితో మసిపూడి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. సింగరేణి స్కాంలో లబ్ధిదారులు ఎవరు..? నష్టం ఎంత..? ఎవరు బాధ్యులో.. భట్టివిక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


భట్టి రక్షిస్తున్నారు..

సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది బాగోతం బయటపడకుండా.. భట్టి రక్షిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ నేతల స్వార్థం‌ కోసం వారికి అనుకూలంగా సింగరేణి విధనాలను మార్చారని ఆక్షేపించారు. 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉందని భట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో ఓబీ వర్క్స్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానమే లేదని స్పష్టం చేశారు. 2018 నుంచి 2024 వరకు అనేక ఓబీ వర్క్స్‌కు టెండర్లు జరిగాయని... వాటికి సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేదని ప్రస్తావించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ కోసం కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్ ఆఫ్ ద బుక్‌ను బయట పెట్టాలని కోరారు. మైనింగ్‌లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్‌లను పక్కన పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ అధికారికంలోకి వచ్చాక‌ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని హరీశ్‌రావు ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 04:25 PM