బీజేపీ న్యాయ పోరాటం వల్లే దానంపై అనర్హత వేటు: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:18 AM
పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 19: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, బీఆర్ఎస్లో కేసీఆర్.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారని అన్నారు. బీజేపీ న్యాయ పోరాటం వల్లే దానం నాగేందర్పై అనర్హత వేటు పడిందని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ భూదందా పార్టీలేనని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘దోచుకోవాలి, దాచుకోవాలి.. పది తరాలకు సరిపోయెంత సంపాదించుకోవాలి. దోపిడీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్పై అనేక అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అనేక హామీలిచ్చి నెరవేర్చకపోగా ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఒకరపై ఒకరు పరస్పరం దోపిడీ ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు. దోపిడీ చేసిన వారిని ఫాంహౌస్లకే పరిమితం చేశారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. దుర్మార్గపు రాజకీయ అవినీతిపరులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికలకైనా బీజేపీ సిద్ధంగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్
Read Latest Telangana News And Telugu News