తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై సీఎం స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - May 01 , 2026 | 01:46 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
ఆసిఫాబాద్, మే1 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఈ నెల 7వ తేదీన పర్యటించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ సాగునీటి రంగంలో కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 నుంచి 150 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రానున్నారు.
అధికార యంత్రాంగం కసరత్తు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎమ్మెల్సీ దండే విట్టల్ పర్యవేక్షించారు. హెలిప్యాడ్ నిర్మాణం, భద్రతా చర్యలు, సీఎం పర్యటన రూట్ మ్యాప్, బ్యారేజీ నిర్మాణ నమూనాల ప్రదర్శనపై అధికారులు చర్చించారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యం..
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆసిఫాబాద్ జిల్లాలోని కరవు ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉండే ఈ ప్రాజెక్టు ఎత్తు విషయంలో గతంలో అనేక చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి అడుగులు పడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల స్థానిక ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటనతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ పనుల్లో వేగం పెరుగుతుందని జిల్లా రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పర్యటనకు సంబంధించిన తుది షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో అధికారికంగా విడుదల కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం
పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And International News And Telugu News