అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం.. హాజరైన వసంత కృష్ణప్రసాద్
ABN , Publish Date - May 20 , 2026 | 06:00 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేరీల్యాండ్లో శ్రీనాథ్రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేరీల్యాండ్లో శ్రీనాథ్రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వసంత కృష్ణప్రసాద్, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం, పోలవరం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇటీవల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం శుభపరిణామని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఏపీలో ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో అభివృద్ధి నిరోధక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో సంస్కరణలు చాలా వేగంగా అమలవుతున్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ శరవేగంగా అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ మూడుతరాల ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ కోటిమంది సభ్యులతో పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. మంత్రి లోకేశ్ చొరవతో రాష్ట్రానికి పలు రూపాల్లో పెట్టుబడులు వచ్చాయని ప్రస్తావించారు. తద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు.

ఆన్లైన్లో మహానాడు నిర్వహిస్తున్నాం: మన్నవ సుబ్బారావు
తెలుగుదేశం పార్టీ ఏటా మహానాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. టీడీపీ ఆవిర్భవించి 44 వసంతాలు పూర్తిచేసుకుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో తెలుగుదేశం శక్తిమంతమైన ప్రజాఉద్యమంగా రూపుదిద్దుకుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాను మాగులూరి, చల్లా ప్రభాకర్, నూతక్కి రమేశ్, శ్రీనివాస్ దామా, శివనాగ మహేశ్ నెలకుదిటి, సతీశ్ సూదిరెడ్డి, శివ నెల్లూరి, పైడి శ్రీనివాసరావు, హర్ష పేరంనేని తదితరులు ప్రసంగించారు. పర్సిస్ ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్ యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది.

ఈ వార్తలు చదవండి
మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
రాలీలో కన్నులపండువగా శ్రీ సీతారామ కల్యాణం.. భారీగా పాల్గొన్న ప్రవాస భారతీయులు
Read Latest NRI News And AP News And International News And Telugu News