Share News

పొదుపు సూత్రాలపై ఢిల్లీ సర్కార్ స్పెషల్ ఫోకస్..

ABN , Publish Date - May 14 , 2026 | 05:08 PM

దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, ప్రజా రవాణా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది.

పొదుపు సూత్రాలపై ఢిల్లీ సర్కార్ స్పెషల్ ఫోకస్..
Delhi Government

ఢిల్లీ, మే14 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, ప్రజా రవాణా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఇచ్చిన పొదుపు సూత్రాల పిలుపు మేరకు ఢిల్లీ ప్రభుత్వం పలు సంస్కరణాత్మక చర్యలను ప్రకటించింది. ముఖ్యమంత్రి రేఖాగుప్తా (Delhi CM Rekha Gupta) ఆధ్వర్యంలో తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం, ఇంధన వినియోగ నియంత్రణ, ప్రజా రవాణా ప్రోత్సాహంపై కేంద్రీకృతమై ఉన్నాయి.


ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్

ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ఇంధన వినియోగాన్ని నియంత్రించడం లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రేపటి నుంచే అమల్లోకి వస్తుందని సీఎం రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వాహనాల సంఖ్య తగ్గి, కాలుష్య నియంత్రణకు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సీఎం కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు

ప్రభుత్వ ఖర్చులు తగ్గించడంలో భాగంగా సీఎం కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను నాలుగుకు పరిమితం చేశారు. ఇందులో రెండు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని నిర్ణయించారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.


‘నా భారతదేశం – నా కర్తవ్యం’ ఉద్యమం ప్రారంభం

పౌరుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో ‘నా భారతదేశం – నా కర్తవ్యం’ పేరుతో ప్రత్యేక ఉద్యమాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగనుంది.ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం.

ప్రతి సోమవారం ‘మండే మెట్రో’

ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఉన్నతాధికారులు ప్రతి సోమవారం తప్పనిసరిగా ఢిల్లీ మెట్రోలోనే ప్రయాణించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిని ‘మండే మెట్రో’ పేరుతో ప్రత్యేక కార్యక్రమంగా అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజారవాణా వినియోగాన్ని ప్రోత్సహించడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీ తగ్గించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.

నో వెహికిల్ డే నిర్వహణ..

సామాన్య ప్రజలు కూడా వారంలో కనీసం ఒక రోజైనా ‘నో వెహికిల్ డే’ పాటించాలని ప్రభుత్వం సూచించింది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, సైకిళ్లు, మెట్రో, బస్సులు వంటి పర్యావరణహిత రవాణా మార్గాలను వినియోగించాలని కోరింది.


కొత్త వాహనాల కొనుగోళ్లపై నియంత్రణ

ప్రభుత్వ శాఖలు వచ్చే ఆరు నెలల వరకు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే ఇప్పటికే ఉన్న వాహనాలనే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రభుత్వ ఖర్చులను తగ్గించడమే కాకుండా, వనరుల సమర్థ వినియోగానికి దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ పెంపు..

ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌ను 10 శాతం పెంచుతూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.


విదేశీ పర్యటనల రద్దు..

ప్రభుత్వ వ్యయ నియంత్రణలో భాగంగా వచ్చే ఏడాది వరకు అన్ని విదేశీ అధికారిక పర్యటనలను పూర్తిగా రద్దు చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా విదేశీ ప్రయాణాలకు అనుమతి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పర్యావరణ పరిరక్షణపై ఫోకస్..

ఢిల్లీ ఇప్పటికే వాయు కాలుష్య సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పర్యావరణ పరిరక్షణకు కీలకంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్, మెట్రో వినియోగం, నో వెహికిల్ డే వంటి చర్యలతో వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం నియంత్రణలోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 05:46 PM