టీఎంసీకి మరో షాక్.. బీజేపీలోకి ముగ్గురు మాజీ రాజ్యసభ సభ్యులు
ABN , Publish Date - Jul 09 , 2026 | 07:45 PM
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీలు తాజాగా బీజేపీలో చేరారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(TMC)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, టీఎంసీని వీడిన కేంద్ర మాజీ మంత్రి సుష్మితా దేవ్, సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్, గిరిజన నేత ప్రకాశ్ చిక్బరాయిక్ గురువారంనాడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కోల్కతా సాల్ట్లేక్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్రధ్యక్షుడు సమిక్ భట్టాచార్య.. కాషాయ కండువా కప్పి వీరిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. రాజ్యసభలో విశేష అనుభవం కలిగిన ఈ ముగ్గురు నేతల చేరికతో బీజేపీ మరింత బలోపేతం కానుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసంతోనే వారు బీజేపీలో చేరారని చెప్పుకొచ్చారు. టీఎంసీ సహా వామపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించిన భట్టాచార్య.. కేంద్ర ప్రభుత్వంతో సహకరించకుండా విమర్శనాత్మక వైఖరి అవలంబించడం వల్లే బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.
ఇక.. సుష్మితా దేవ్ స్పందిస్తూ.. 'ఒకేసారి 2 పడవల్లో ప్రయాణించడం నాకిష్టం లేదు. అందుకే పార్టీని వీడాను. అంతేతప్ప కేవలం రాజ్యసభ సభ్యత్వం కోసమే బీజేపీలో చేరలేదు' అని స్పష్టం చేశారు. అయితే.. బెంగాలు ప్రజలు అవినీతి, మహిళలపై పెరిగిన దాడుల కారణంగా టీఎంసీని బహిరంగంగా తిరస్కరించారని సుఖేందు శేఖర్ రాయ్ ఆరోపించారు. టీఎంసీ రాజకీయంగా పూర్తిగా బలహీనపడిందన్న సుఖేందు.. ప్రధాని మోదీ ప్రతిపాదించిన వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగమయ్యేందుకు కమలం పార్టీలో చేరానన్నారు.
ఇవీ చదవండి:
న్యూజిలాండ్ పర్యటనకు మోదీ.. లక్సన్ కీలక ప్రకటన
మెల్బోర్న్లో మోదీకి ఘన స్వాగతం.. మార్వెల్ స్టేడియం 'హౌస్ఫుల్'