రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం కీలకం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 20 , 2026 | 07:09 PM
ఎన్డీఏ హయాంలో దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మన సొంత ఇంటి పైకప్పులపైనే విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగల స్థాయికి మనం చేరుకున్నామని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ హయాంలో దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. మన సొంత ఇంటి పైకప్పులపైనే విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగల స్థాయికి మనం చేరుకున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి రూఫ్టాప్ సోలార్ వంటి పథకాలను ప్రవేశపెట్టారని, దీనికి సుమారు రూ.78,000 వరకు సబ్సిడీ అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇంట్లోనే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుని, దానిని అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా కుసుమ్ వంటి పథకాల కింద రైతులకు వారి సొంత పొలాల్లోనే విద్యుత్ను ఉత్పత్తి చేసుకునేందుకు సౌర సౌకర్యాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. ఏపీ వంటి ప్రదేశాల్లో ఉచిత సరఫరా కూడా అందిస్తున్నారని అన్నారు. దీనివల్ల వారు విద్యుత్ను ఉపయోగించుకోవడంతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ కూడా చేసుకోవచ్చని, తద్వారా విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని వివరించారు.
మోదీ ప్రభుత్వ పాలనను బలోపేతం చేయాలి..
ఈ కార్యక్రమాలన్నింటితో పాటు, మనం ఒక ప్రగతిశీల ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక్కడి ప్రజలకు అభివృద్ధి కావాలా..? , మీకు ఉద్యోగాలు కావాలా..?, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో ఇవి సాధ్యమవుతాయా..? మీకు కేంద్రం నుంచి మద్దతు కావాలా లేదా..? అని అడిగారు. ఇవన్నీ జరగాలంటే, కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని పాలనను బలోపేతం చేయాలని సూచించారు. ఈ దార్శనికతకు సహకరించాలని కోరారు. ఒకప్పుడు జయలలిత ప్రాతినిధ్యం వహించిన నాయకత్వం తమిళనాడులో కూడా మనకు అవసరమని చెప్పుకొచ్చారు. మళ్లీ అలాంటి పాలన కావాలంటే ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, మాదకద్రవ్యాల వ్యాప్తి, ప్రజలపై రుణభారం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో పరిస్థితి దిగజారుతోందని చెప్పారు. మహిళలపై నేరాలు సుమారు 59 శాతం పెరిగాయన్నారు. షెడ్యూల్డ్ కులాల వారిపై దాడులు 39 శాతం పెరిగాయని తెలిపారు. పోలీసు కస్టడీలో మరణాలు కూడా పెరిగాయని అన్నారు.
ప్రజలు తీవ్రమైన అభద్రతాభావం, అశాంతితో సతమతం..
తమిళనాడు ప్రజలు తీవ్రమైన అభద్రతాభావం, అశాంతితో సతమతమవుతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొన్ని ప్రాంతాల్లో, స్థానిక ముఠాలు కూడా దోపిడీలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని అన్నారు. హిందూ ధర్మాన్ని అవమానించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న విభేదాలు, ద్వేషం కారణంగా 'భారతీయులమనే' ఏకత్వ భావన బలహీనపడుతోందని చెప్పారు. అవినీతి లేని గ్రామం, వినాశనం వైపు పయనించని నగరం, సమాజంలో ఎవరూ వెనుకబడని పరిస్థితి ఉండాలని సూచించారు. ఎన్డీఏ పక్షానా ఇక్కడి ప్రజలు నిలబడాలని, తమిళనాడు విజయం వైపు పయనించేలా చూడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ప్రస్తావించారు. భారీ మొత్తంలో రూ.14.24 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు. కేవలం గత ఐదేళ్లలోనే, 4,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణానికి సుమారు రూ.60,000 కోట్లు కేటాయించారని తెలిపారు. తాను ఈ రోజు ఇక్కడికి వస్తుండగా, మీ ప్రాంతం సమీపం నుంచే వెళ్లే బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డును చూశానని…. ఇది రాత్రికి రాత్రే సాధ్యపడిన విషయం కాదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు
ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
జగన్ నుంచి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు ప్రమాదం ఉంది: గోరంట్ల
Read Latest AP News And Telangana News And International News And Telugu News