'బాస్ ఎవరో ఆయనకు తెలుసు'.. నెతన్యాహుపై ట్రంప్ వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 07:55 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుల మధ్య అభిప్రాయభేదాలున్నట్టు పలు అంతర్జాతీయ మీడియాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు త్వరలోనే ప్రత్యక్షంగా సమావేశమయ్యే అవకాశముంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలో అమెరికాలో పర్యటించే అవకాశమున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు సంకేతాలిచ్చాయి. అందులో భాగంగా శ్వేతసౌధంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 7, 8న ట్రంప్.. టర్కీలో జరిగే నాటో శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాతి వారం ఇరువురు నేతలు సమావేశమయ్యే అవకాశముంది.
ఈ సందర్భంగా ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహుతో తనకు మంచి సంబంధాలున్నాయన్న ట్రంప్.. 'బాస్ ఎవరో ఆయనకు తెలుసు' అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ భేటీపై ట్రంప్ శుక్రవారం నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. త్వరలోనే అమెరికాలో ప్రత్యక్షంగా సమావేశం కావాలని ఇరువురు నేతలూ అంగీకరించినట్లు తెలిపింది.
కాగా... పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ ఇటీవల పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ భేటీ రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలపై కీలక ప్రభావం చూపే అవకాశమున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి:
ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్
పెళ్లి ఉంగరాలు, గాజులు.. దేశాన్ని కాపాడేందుకు 227 టన్నుల బంగారం ఇచ్చిన దక్షిణ కొరియా ప్రజలు..