విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:34 PM
తిరుపతి విమానాశ్రయంలో ఒకటిన్నర నెలలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు జారీ చేసే టికెట్లు మిగిలిపోతున్నాయి.
రేణిగుంట(తిరుపతి): తిరుపతి విమానాశ్రయంలో ఒకటిన్నర నెలలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు జారీ చేసే టికెట్లు మిగిలిపోతున్నాయి. రోజూ 40 శాతానికిపైనే టికెట్లు జారీ చేయకుండానే కౌంటర్ను మూసివేయాల్సి వస్తోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ రోజూ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా 800, విమానాశ్రయంలో 200 చొప్పున శ్రీవాణి టికెట్లను జారీ చేస్తోంది. ఆన్లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేసే 800 టికెట్ల కోటా క్షణాల్లో పూర్తవుతుంటే విమానాశ్రయంలో జారీ చేసే 200 టికెట్లలో సగానికిపైగానే మిగిలిపోతున్నాయి.
గతంలో రోజూ ఉదయం ఏడు గంటల నుంచి హైదరాబాదు నుంచి తిరుపతికి ఐదు విమాన సర్వీసులు నడిచేవి. ఈక్రమంలో మధ్యాహ్నం 11 గంటలకే 200 టికెట్ల కోటా విక్రయాలు పూర్తయ్యేవి. ఇటీవల యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. విమాన టికెట్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రయాణికుల రాకపోకలు చాలావరకు తగ్గిపోయిన క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చే కొన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు.
సాధారణంగా శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులకు అదేరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి దర్శనం కల్పిస్తారు. ఈక్రమంలో రెండు గంటల ముందు అంటే మధ్యాహ్నం రెండు గంటలకు విమానాశ్రయంలోని కౌంటర్ను మూసివేస్తున్న క్రమంలో రోజూ 50 నుంచి 100 టికెట్లు మిగిలిపోతున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 22వ తేదీ వరకు పరిశీలిస్తే 4,400 టికెట్లు అందుబాటులో ఉంచితే 2,980 విక్రయం కాగా, 1420 మిగిలిపోయాయి.
తాజాగా మంగళవారం కూడా 90 టికెట్లు విక్రయం కాగా, 110 టికెట్లు మిగిలిపోయాయి. మామూలుగానే శ్రీవాణి టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈక్రమంలో మిగిలిన టికెట్లను ఆన్లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయిస్తే మిగిలిన భక్తులు వినియోగించుకుంటారని, లేదా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు విపరీతమైన ఒత్తిడి నెలకొంటున్న సమయంలో సిఫార్సులపై కేటాయించినా ఈ టికెట్లు వృథా కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్లోకి తీసుకెళ్లి..
Read Latest Telangana News and National News