ఫేక్సైట్లతో టీటీడీ భక్తులను దోచుకుంటున్న సైబర్ మోసగాళ్లు
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:47 PM
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరుతో సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
తిరుపతి, జులై 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరుతో సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండేలా ఫేక్ వెబ్సైట్ రూపొందించి, భక్తులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. "ttddevasthanam.online" పేరుతో నకిలీ వెబ్సైట్ను సృష్టించి, అర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారని తెలిపారు.
ఈ ఫేక్ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నించే భక్తుల నుంచి వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు సేకరించి సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండేలా డిజైన్ చేయడంతో చాలామంది భక్తులు ఇది అసలైన వెబ్సైట్గా భావించి మోసపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల విషయంలో ఇప్పటికే పలుమార్లు టీటీడీ భక్తులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. వేంకటేశ్వరస్వామి దర్శనం, అర్జిత సేవలు, వసతి, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు వంటి అన్ని బుకింగ్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, తెలియని లింకులు, అనధికార వెబ్సైట్లను నమ్మొద్దని టీటీడీ అధికారులు సూచించారు. వెబ్సైట్ అడ్రస్ను ఒకటికి రెండుసార్లు పరిశీలించి మాత్రమే ఆన్లైన్ చెల్లింపులు చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వెబ్సైట్లు లేదా లింకులు కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారులకు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. భక్తులు అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి సైబర్ మోసాల నుంచి బయటపడవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి
ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్బస్సు వచ్చేస్తోంది!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News