ఇన్స్టాలో రీల్స్ చూసి తప్పటడుగులు..
ABN , Publish Date - Apr 15 , 2026 | 07:22 AM
ఢిల్లీలో కొనుగోలు చేసిన కారును తెలంగాణకు తీసుకువస్తే రూ.లక్షల్లో రోడ్డు ట్యాక్స్ కట్టాలని భావించిన ఓ యువ వైద్యుడు కొత్త ఎత్తుగడ వేశాడు.
యువ వైద్యుడి ఎత్తుగడ..నంబర్ ప్లేట్ మార్పిడి కేసులో కొత్త కోణాలు
హైదరాబాద్: ఢిల్లీలో కొనుగోలు చేసిన కారును తెలంగాణకు తీసుకువస్తే రూ.లక్షల్లో రోడ్డు ట్యాక్స్ కట్టాలని భావించిన ఓ యువ వైద్యుడు కొత్త ఎత్తుగడ వేశాడు. ఇన్స్టాలో రీల్స్ చూసి ఈ తప్పటడుగులు వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మూడు రోజుల క్రితం జరిగిన జూబ్లీహిల్స్ నంబర్ ప్లేట్ మార్పిడి కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. అశోక్నగర్కు చెందిన వైద్యుడు డాక్టర్ గౌతంరెడ్డి నాలుగేళ్ల క్రితం బీఎండబ్ల్యూ కారును ఢిల్లీలో కొనుగోలు చేశాడు.
దాన్ని తెలంగాణకు బదిలీ చేసుకునేందుకు రూ.12-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. రోడ్డు ట్యాక్స్ నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తుండగా, ఇన్స్టాలో ఓ రీల్ చూశాడు. కిటికీ కర్టెన్ మార్పిడికి ఉపయోగించే మోటార్ల గురించి తెలుసుకున్నాడు. అనంతరం ఆన్లైన్లో నంబర్ ప్లేట్ మార్పిడి పరికరాల గురించి తెలుసుకున్నాడు. రూ. పది వేలు వెచ్చించి దాన్ని తెప్పించుకొని మాదాపూర్లో ఓ మెకానిక్తో ఫిట్ చేయించాడు. నంబర్ ప్లేట్ బరువుకు అది పనిచేయలేదు.
దీంతో బ్యానర్ క్లాత్తో తెలంగాణ నంబర్ ప్రింట్ చేయించి ప్లేట్ స్థానంలో అమర్చాడు. నాలుగేళ్ల నుంచి నగరంలో యథేచ్ఛగా రోడ్లపై నడుపుతూ తిరుగుతున్నాడు. ఈ నెల 11న జూబ్లీహిల్స్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుండగా మద్యం తాగి బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న గౌతంను పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో కారు నెంబర్ ప్లేట్ మార్పిడి వ్యవస్థను గుర్తించి విస్తుపోయారు. మద్యం తాగి ఉన్న డ్రైవర్తో పాటు కారును ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ శాంతిభద్రతల పోలీసులకు అప్పగించారు. ఆ కారుకు వాడి నకిలీ నెంబర్ కూడా తన బాబాయి కారుకు చెందినదే అని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ పరిశీలనలో డీజీపీ నియామకం
దూరదృష్టితోనే అమరావతికి పెట్టుబడులు
Read Latest Telangana News and National News