తుంగభద్రలో మునిగి నలుగురి మృతి
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:36 AM
ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. మృతులంతా దాయాదులే చెందిన వారు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కోసిగి(కర్నూలు): ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. మృతులంతా దాయాదులే చెందిన వారు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు గ్రామానికి చెందిన దాసరి ఆదిశేషు, సంగీతకు ఈ నెల 25న వివాహం జరిగింది. ఈ వేడుకలకు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి తాలుకా కురిడి గ్రామానికి చెందిన బంధువులు వచ్చారు. శుక్రవారం రాత్రి వారి సొంతూరికి వెళ్లేముందు, సరదాగా గడపాలనుకొని మధ్యాహ్నం పెద్దలు, పిల్లలు ఎనిమిది మంది కలిసి అగసనూరు సమీపంలోని తుంగభద్ర(Tungabhadra) నది ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు ఈతకు వెళ్లారు.
సెల్ఫీలు, వీడియోలు, ఫొటోలు తీసుకునే క్రమంలో దాసరి రత్నమ్మ (26) లోతు గమనించకుండా నదిలో ముందుకెళ్లడంతో ఒక్కసారిగా మునిగిపోయింది. ఆమెను రక్షించేందుకు దాసరి ఉమావతి(28) వెళ్లింది. ఇద్దరూ నీట మునిగిపోగా వారిని కాపాడడానికి వెళ్లిన దాసరి శివానంద (20) దాసరి మహంతేశ్ (20) కూడా మునిగిపోయారు. వెంటనే అక్కడున్న మత్స్యకారులు, గజ ఈతగాళ్లు, స్థానికులు గాలింపు చేపట్టి నీటమునిగిన నలుగురినీ బయటకు తీసుకువచ్చారు.
అయితే అప్పటికే వారందరూ మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, టీడీపీ మంత్రాలయం ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి, కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ రమేశ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉమావతికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రత్నమ్మకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మహిళలకు వరుసకు కుమారులైన శివానంద, మహంతేశ్కు ఇంకా వివాహం కాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
విజయవాడ రైల్వేస్టేషన్ రీడెవలప్మెంట్కు ఆటంకాలు
Read Latest Telangana News and National News