విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
ABN , Publish Date - Jul 22 , 2026 | 06:55 AM
విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి సరుకును అన్లోడ్ చేస్తున్న కళాసిలను రెడీమిక్స్ కాంక్రీట్ (RMC) లారీ ఢీకొట్టింది.
విశాఖపట్నం, జులై 22 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి సరుకును అన్లోడ్ చేస్తున్న కళాసిలను రెడీమిక్స్ కాంక్రీట్ (RMC) లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కయ్యపాలెం జాతీయ రహదారి పక్కన ఇద్దరు కళాసిలు సరుకును అన్లోడ్ చేస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన రెడీమిక్స్ కాంక్రీట్ లారీ అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు ఒకరు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ముందుగా లారీ బస్టాప్ సమీపంలోని గోడను ఢీకొట్టి, అనంతరం అక్కడ నిలిపి ఉన్న సరుకు వాహనాన్ని, అన్లోడ్ పనుల్లో నిమగ్నమైన వారిని ఢీకొట్టినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. డ్రైవర్లు అలసట, నిద్రమత్తులో వాహనాలు నడపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మూడువేల కుటుంబాలకు ఇంటి పట్టాలు అందజేసిన మంత్రి లోకేశ్
నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్: హోం మంత్రి అనిత
తమ్మినేని సీతారం భూ అక్రమాలపై చర్యలుంటాయి: మంత్రి అనగాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News