విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: ఎమ్మెల్యే కోటంరెడ్డి
ABN , Publish Date - Sep 01 , 2026 | 02:15 PM
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయసాయిరెడ్డిని కొట్టింది నిజమేనని తెలిపారు.
నెల్లూరు, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (TDP MLA Kotamreddy Sridhar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయసాయిరెడ్డిని కొట్టింది నిజమేనని తెలిపారు. మంగళగిరిలో ప్లీనరీ జరిగేటప్పుడు రెస్ట్ రూమ్లో వేదికపై ఎవరితో మాట్లాడించాలనే విషయంపై వీరిద్దరి మధ్య వివాదం తలెత్తి, మాటామాటా పెరిగి కొట్టింది వాస్తవమేనని చెప్పుకొచ్చారు. ఆ విషయం చాలామంది నేతలకు తెలుసునని అన్నారు. విజయసాయికి వైసీపీలో 72 అవమానాలు జరిగాయని చెప్పారు. ఆయన నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేసినప్పుడు ఎంత నీచంగా, ఘోరంగా మాట్లాడారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు.
సజ్జల దారుణంగా దూషించారు..
ఈరోజు (మంగళవారం) నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఒక్కడికే తెలిసి మరో ఘోర అవమానం జరిగిందని అన్నారు. విజయసాయి తన సొంతూరైన తాళ్లపూడికి వచ్చినప్పుడు, కాకుపల్లి సెంటర్లో వంద వాహనాలతో ఘనంగా స్వాగతం పలికారని వెల్లడించారు. దానిపై విజయసాయిని సజ్జల దారుణంగా దూషించారని చెప్పుకొచ్చారు. ఆ మాటలు చెప్పలేని విధంగా ఉన్నాయని అన్నారు.
విజయసాయిపై నాకు మంచి అభిప్రాయం లేదు..
‘నేను చాలా పెద్ద తప్పు చేశానని సజ్జల అన్నారు. అమరావతి రైతులు వరదలు, భారీ వర్షాల్లో ఇబ్బందులు పడుతుంటే నేను మాట్లాడాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గం దాటేంత వరకు ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటానని చెప్పా. అప్పుడూ సజ్జల... నన్ను చాలా పెద్ద తప్పు చేశావన్నారు. ఇలాంటి మాటలు నాతో మాట్లాడొద్దని.. ఆ తప్పు చేసింది.. నువ్వా, నేనా..? అని సజ్జలను ఎదిరించి మాట్లాడాను. మా ఊరిలో విజయసాయి మీటింగ్ పెట్టి నన్ను ఎలా పడితే అలా తిట్టాడు. ఆయనంటే నాకు మంచి అభిప్రాయం లేదు’ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది..
‘వైసీపీ హయాంలోని ఐదేళ్లు ప్రజావ్యతిరేక పాలన కొనసాగింది. దేశవిదేశాల నుంచి ఆంధ్రులు వచ్చి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసి కూటమిని గెలిపించారు. కూటమి ప్రభుత్వ ఘనవిజయం ఓ చరిత్ర అయితే, వైసీపీ ఘోర పరాజయం కూడా చారిత్రక ఘట్టం. ఎందుకు ఓడిపోయామనే ఆలోచన లేకుండా... వైసీపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ వికృత రాజకీయం చేస్తోంది. వైసీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారు. హిందూ మతానికి ఘోర అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కావట్లేదు. ఆలయాల్లో రథాలు తగులపడినప్పుడు, విగ్రహాల తలలు తెగ్గొట్టినప్పుడు, సింహాల విగ్రహాలు చోరీకి గురైనప్పుడు మీ నోళ్లు ఏమయ్యాయి. తిరుపతి వేంకటేశ్వర ఛానెల్ను కూడా రాజకీయాలకు వాడుకున్నారు. వైసీపీ మాజీ మంత్రిపై ఆయన కోడలు సంచలన ఆరోపణలు చేశారు. ఆమె పెళ్లి అయినప్పుడు హిందువులమని మాజీ మంత్రి చెప్పారని... పెళ్లి అయ్యాక హిందు దేవుళ్లని పూజిస్తే కొట్టారని ఆమె చెప్పింది. జగన్, వైసీపీ నేతలు, సాక్షి మీడియా ఎందుకు ఈ విషయంపై స్పందించట్లేదు. ఏపీని అస్థిరపరచాలని ఓ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు రాకూడదని ఫేక్ వీడియోలతో ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం. వైసీపీ క్రెడిట్ చోరీ చూస్తుంటే... నాగార్జునసాగర్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టులు కట్టింది జగనే అని చెప్పేటట్లుగా ఉన్నారు. ఇంకా ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కూడా జగనే అని చెప్పేటట్లుగా ఉన్నారు’ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి విమర్శించారు.