ఎల్నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 09 , 2026 | 04:13 PM
పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళలాడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎల్నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారమని పేర్కొన్నారు.
విజయవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళలాడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఎల్నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారమని పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు 17 టీఎంసీల నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. గోదావరి నీటితో నిండుకుండలా బ్యారేజ్ ఉందని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళ్తున్న సమయంలో బ్యారేజ్పై కాసేపు తన వాహన కాన్వాయ్ను సీఎం నిలిపారు. ప్రకాశం బ్యారేజ్లో గోదారమ్మ నీటి పరవళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటిని తిలకించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.
పట్టిసీమ ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలు..
గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం తెలిపారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 17.52 టీఎంసీల నీటిని కృష్ణానదికి తరలించినట్లు అధికారులు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటి వరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు సీఎంకు అధికారులు వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.
సాగునీటి ఇబ్బందులను అధిగమించాలి..
కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3115 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. సమర్థంగా నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు అన్నివిధాలా పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
వార్తలు కూడా చదవండి...
ఎల్నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News