ఏపీ లిక్కర్ కేసు.. సుప్రీం కోర్టులో నిందితులకు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:49 PM
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్ను రద్దుచేస్తూ.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
న్యూఢిల్లీ, జనవరి21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో(AP Liquor Case) నిందితులకు సుప్రీంకోర్టులో (Supreme Court) గట్టి షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్ను రద్దుచేస్తూ.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం న్యాయస్థానం సమర్థించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలివే..
ఈ కేసు నేడు సీజేఐ(CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని ఈ మేరకు ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులు తమకు బెయిల్ కావాలంటే సంబంధిత ట్రయల్ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఆదేశించింది.
మధ్యంతర రక్షణ పొడిగింపు..
అయితే.. ఈ కేసులో నిందితులకు తక్షణమే అరెస్ట్ ముప్పు లేకుండా కొంత ఉపశమనం కలిగించింది సుప్రీం కోర్టు. గతంలో (నవంబర్ 26న) సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు(Interim Protection) ప్రస్తుతం కొనసాగుతాయని తెలిపింది. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ రాకపోతే.. తిరిగి హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా నిందితులకు నాలుగు వారాల పాటు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వచ్చే నెలరోజుల వరకు వారికి అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది.
అసలు వివాదం ఏమిటి?
ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు సకాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని పేర్కొంటూ ట్రయల్ కోర్టు నిందితులకు 'డీఫాల్ట్ బెయిల్' మంజూరు చేసింది. అయితే.. దీనిపై ఏపీ ప్రభుత్వం(సిట్) హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఆ డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది. నిందితులు దీనిని సవాల్ చేసినప్పటికీ.. సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయమే సరైనదని అభిప్రాయపడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News