పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 20 , 2026 | 06:59 PM
ప్రస్తుతం భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా వేగంగా రూపాంతరం చెందుతోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే భారత్ ఇప్పుడు పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానమని సీఎం పేర్కొన్నారు..
ఇంటర్నెట్ డెస్క్, జనవరి20(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా వేగంగా రూపాంతరం చెందుతోందని ఏపీ నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే భారత్ ఇప్పుడు పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానమని పేర్కొన్నారు. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇండియా లాంజ్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. నేషన్ ఫస్ట్ అనే స్పూర్తి చాటేలా టీమ్ ఇండియాగా అంతా కలిసి పనిచేద్దామని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులకు పిలుపునిచ్చారు.
బలమైన నాయకత్వం..
ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు మాత్రమే చూస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మన దేశానికి బలమైన నాయకత్వం ఉందని... మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పామని తెలిపారు. పటిష్టమైన వ్యవస్థల రూపకల్పన కూడా జరుగుతోందని వివరించారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా భారత్కే ప్రాతినిధ్యం వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాలుగా పోటీపడినా.. దేశంగా ఒక్కటిగానే ఉన్నామని, పరస్పరం సహకరించుకుంటున్నామని వెల్లడించారు. సంపద ఒక్కటే కాదని.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..
ఏపీలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ప్రపంచం ఎలా ముందుకు వెళ్తోందో నేర్చుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ప్రస్తుతం అంతా గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి అగ్రస్థానానికి చేరుతుందని సీఎం పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోంది: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News