Share News

ఏపీఎల్‌ను ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్తాం: కేశినేని శివనాథ్

ABN , Publish Date - Jun 23 , 2026 | 08:51 AM

ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌ని నిర్వహిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివనాథ్(చిన్ని) వ్యాఖ్యానించారు. ఐపీఎల్ తరహాలో తీసుకెళ్లడానికి ప్రభుత్వం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఏపీఎల్‌ను ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్తాం: కేశినేని శివనాథ్
Kesineni Sivanath

అమరావతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL)ను నిర్వహిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Sivanath) వ్యాఖ్యానించారు. ఏపీఎల్‌ని.. ఐపీఎల్ తరహాలో తీసుకెళ్లడానికి ప్రభుత్వం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అన్ని హంగులతో ముస్తాబైంది. ఈ స్టేడియం నిర్మాణ పనులను కేశినేని శివనాథ్ ఈరోజు (మంగళవారం) పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శివనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


మంగళగిరిలో అత్యాధునిక స్టేడియాన్ని నిర్మించాం..

సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు వీక్షిస్తారని కేశినేని శివనాథ్ తెలిపారు. అమరావతిలోని మంగళగిరిలో సుమారు 25,000 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన అత్యాధునిక స్టేడియాన్ని నిర్మించామని వివరించారు. ఆటగాళ్ల కోసం జిమ్, 74 గదులు, లైవ్ స్ట్రీమింగ్, బ్రాడ్‌కాస్టింగ్ రూమ్స్‌తో పాటు జర్నలిస్టుల కోసం ప్రత్యేక బాక్సులను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. గత పదేళ్లలో కేవలం ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే జరిగాయని తెలిపారు. విశాఖపట్నం స్టేడియాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కేవలం ఒక్క సంవత్సరంలోనే 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని ప్రస్తావించారు. కడప స్టేడియాన్ని కూడా పూర్తిగా రినోవేట్ చేశామని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి విజయవాడ, కాకినాడ, తిరుపతిలో కూడా స్టేడియాలను సిద్ధం చేస్తామని చెప్పుకొచ్చారు.


ఆరు ప్రాంతాల్లో ఏపీఎల్ మ్యాచ్‌లు..

ఏపీలో ఆరు ప్రాంతాల్లో ఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శివనాథ్ వివరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల లీగ్‌లతో పోలిస్తే ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు అత్యంత జనాదరణ లభిస్తోందని చెప్పారు. కడపలో జరిగిన మ్యాచ్‌లకు 10,000 మంది వస్తారని అనుకుంటే.. 15,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారని వెల్లడించారు. ఐపీఎల్ తరహాలోనే ఏపీఎల్‌లో కూడా ఆటగాళ్లకు వేలం నిర్వహించి, పేద క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందేలా చేస్తున్నామని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ ఆలోచన మేరకు, ఐపీఎల్‌లో ఉన్నట్లుగానే ప్రతి టీమ్‌కు ఒక హోం పిచ్ ఉండాలనే ఉద్దేశంతో ఆరు స్టేడియాలను సిద్ధం చేస్తున్నామని వివరించారు.


క్రీడాంధ్రప్రదేశ్ కోసం సహకరించాలి..

ఈ మ్యాచ్‌లో క్రికెట్‌తో పాటు మ్యూజికల్ నైట్స్, గాయనీ గాయకులతో వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశామని శివనాథ్ వెల్లడించారు. ఏపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడానికి ఇచ్చే పాస్‌లను ముందుగా ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ లీగ్ ద్వారా ఎంతోమంది కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టులో కూడా చోటు సంపాదించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మీడియా యాజమాన్యాలు కూడా ఏపీఎల్ మ్యాచ్‌లు, ఇతర క్రీడలకు కవరేజి ఇచ్చి, క్రీడాంధ్రప్రదేశ్ కోసం సహకరించాలని శివనాథ్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ABN ఎఫెక్ట్.. ఇంద్రకీలాద్రి నకిలీ టికెట్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం

నెల్లూరు ఏఎస్‌పేట దర్గా వివాదం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. వక్ఫ్‌కు లేఖ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 09:01 AM