విక్రమ్-1 ప్రయోగం భారత్కు చరిత్రాత్మక మైలురాయి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:35 PM
విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ఉప మఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.
అమరావతి, జులై 18 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 'విక్రమ్-1' రాకెట్, 'మిషన్ ఆగమన్' పేరుతో శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ఉప మఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని చరిత్రాత్మక ఘట్టంగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు.
భారతదేశం ఈ రోజు అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుందని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్, అంతరిక్ష సాంకేతికత, ఆవిష్కరణల్లో ప్రపంచ అగ్రగామిగా నిలవాలనే భారతదేశ లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక ప్రయోగం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇస్రో పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు. శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక నైపుణ్యం, యువతలోని వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రోత్సహించడంలో ఇస్రో కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. విక్రమ్-1 మిషన్ భారతీయ ప్రతిభ, శాస్త్రీయ సామర్థ్యం, ఆవిష్కరణల శక్తికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ధైర్యం, పట్టుదల, వినూత్న ఆలోచనలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చనే సందేశాన్ని ఈ ప్రయోగం ప్రతి యువ భారతీయుడికి అందిస్తుందని చెప్పుకొచ్చారు.
ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్ సంస్థల బృందాలకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విక్రమ్-1 మిషన్ విజయవంతంగా పూర్తై భారత అంతరిక్ష రంగానికి మరిన్ని విజయాలకు నాంది పలకాలని ఆకాంక్షించారు. భారతదేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ఈ విజయగాథ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచి, మరింత పెద్ద కలలు కనేందుకు యువతను ప్రేరేపించాలని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది: మంత్రి లోకేశ్

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 350 కేజీల బరువున్న ఉపగ్రహాలను లో-ఎర్త్ ఆర్బిట్లోకి ఈ రాకెట్ తీసుకెళ్లిందని తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని వెల్లడించారు. ఇస్రో నుంచి తొలిసారిగా స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 ప్రైవేట్ రాకెట్ను ప్రయోగించారని తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ను, శాస్త్రవేత్తలను మంత్రి లోకేశ్ అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం: రామ్మోహన్
పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News