కోనసీమ జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
ABN , Publish Date - Aug 26 , 2026 | 10:16 AM
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రామచంద్రపురంలో భార్య తన భర్తను కొట్టి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రామచంద్రపురంలో భార్య తన భర్తను కొట్టి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రామచంద్రపురానికి చెందిన తంగేటి ఎల్లారావు (46)ను అతని భార్య ఉమాదేవి దాడి చేసి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వంటిట్లో వాడే ఓ ఆయుధంతో కొట్టడంతో ఎల్లారావు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య ఉమాదేవిపై ఎల్లారావుకు కొంతకాలంగా అనుమానం ఉండేది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ విభేదాలే చివరకు హత్యకు దారితీసింది. ఎల్లారావు మొదటి భార్య సుమారు 15 ఏళ్ల క్రితం మృతి చెందింది. అనంతరం ఉమాదేవిని రెండో వివాహం చేసుకున్న ఎల్లారావు.. ఆమెతో కలిసి రామచంద్రపురంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వృత్తిరీత్యా వంట పనులు చేసుకుంటూ జీవించేవాడు. భార్యపై అనుమానంతో తరచూ ఆమెతో అతను గొడవపడేవాడు.
ఈ నెల 25వ తేదీన ఎల్లారావు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య ఉమాదేవితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. అనంతరం ఉమాదేవి దాడి చేయడంతో ఎల్లారావు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు తంగేటి సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉమాదేవిపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News