ఇంటి స్థలం.. ఇక సొంతం!
ABN , Publish Date - May 27 , 2026 | 01:09 PM
అసైన్డ్ ఇంటిపట్టాలు కలిగిన వారికి తీపికబురు. పదేళ్ల గడువు తీరిన అసైన్డ్ ఇంటి స్థలాన్ని పట్టాదారుల పేరిటే రిజిస్ర్టేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
అసైన్డ్ ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్
పదేళ్ల గడువు తీరిన వాటికి అవకాశం
క్రయవిక్రయాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు
నిరుపేదల హర్షం
అనంతపురం: అసైన్డ్ ఇంటిపట్టాలు కలిగిన వారికి తీపికబురు. పదేళ్ల గడువు తీరిన అసైన్డ్ ఇంటి స్థలాన్ని పట్టాదారుల పేరిటే రిజిస్ర్టేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. నాలుగు రోజుల క్రితం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్ విషయంలో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ నిర్ణయం ద్వారా జిల్లాలోని వేలమంది పేదలకు పూర్తిస్థాయి శాశ్వత ఇంటి హక్కులు లభించనున్నాయి.
లబ్ధిదారు పేరిట ఉండాలి
అసైన్డ్ ఇంటి పట్టాల రిజిస్ర్టేషన్ విషయంలో నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇంటి పట్టా లబ్ధిదారు పేరిట ఉండాలి. లబ్ధిదారుడే పొజిషన్లో ఉండాలి. ఇంటి స్థలం రిజిస్ర్టేషన్ అయిన 90రోజుల తరువాత దానిపై క్రయవిక్రయాలకు అవకాశం ఉంటుంది. లబ్ధిదారు పూర్తి హక్కులతో కూడిన రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ పొందిన 90 రోజుల అనంతరం తిరిగి ఆ ఇంటిని అమ్ముకోవచ్చు. ఇతరులు కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు వ్యక్తిగత అవసరాలకు ఆ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు.
ఇంటిపన్ను తప్పనిసరి
అసైన్డ్ ఇంటి స్థలం రిజిస్ర్టేషన్ కోసం లబ్ధిదారు తనకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాను సబ్రిజిస్ర్టార్కు సమర్పించాలి. ఇంటి పన్ను చెల్లింపు రశీదులు అందజేయాలి. ఇంటి పన్ను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి. దీంతో పాటు పదేళ్లుగా అక్కడే జీవనం ఉండాలి. ఎవరైనా రిజిస్ర్టేషన్ కోసం వచ్చినపుడు ఆ భూమి అసైన్మెంట్ చేసిన కాలపరిమితి పదేళ్లు దాటిందా? లేదా.. అనేది అధికారులు నిర్థారించుకోవాలి.
లబ్ధిదారు మరణించిన పక్షంలో..
రిజిస్ర్టేషన్ సమయంలో సంబంధిత వ్యక్తి నిజమైన లబ్ధిదారా..? కాదా..? అనేది పరిశీలిస్తారు. అసలు లబ్ధిదారు మరణించిన పక్షంలో, వారసులు రిజిస్ర్టేషన్ కోసం వచ్చినపుడు అసలు పట్టాదారు మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ పొందుపరచాల్సి ఉంటుంది. పదేళ్ల గడువు తీరిన అసైన్డ్ ఇంటి స్థలం నిషేఽధిత జాబితాలో ఉన్నా.. అందులో ఇంటి నిర్మాణం ఉంటే రిజిస్ర్టేషన్కు అనుమతించాలి. గతంలో వన్టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) కింద రెగ్యులరైజ్ అయిన ఇళ్లను కూడా హక్కుదారుల పేరిట రిజిస్ర్టేషన్ చేయాలి. ప్రభుత్వం నిర్ధేశించిన డాక్యుమెంట్లు మినహా అదనంగా ఇతర పత్రాల కోసం ఒత్తిడి తీసుకురాకూడదని స్పష్టం చేశారు. ఫేక్ పట్టాలు, నకిలీ ఉత్తర్వులతో రిజిస్ర్టేషన్ చేయమనేవారిపై రిజిస్ర్టేషన్ చట్టంలోని సెక్షన్లు 82, 83 ప్రకారం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే ఆదేశాలున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
స్టాన్ఫర్డ్లో చదివింది నేను.. పేపర్ లీక్ చరిత్ర జగన్ది.. లోకేశ్ సెటైర్లు
మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News