Share News

మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

ABN , Publish Date - May 27 , 2026 | 09:59 AM

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు-2026 వేడుకలు అమరావతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
TDP Mahanadu 2026

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నిర్వహిస్తున్న మహానాడు-2026 వేడుకలు అమరావతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు.


వర్చువల్ విధానంలో మహానాడు..

అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. ఈసారి మహానాడును పూర్తిగా సాంకేతికత ఆధారంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో 1851 క్లస్టర్లను పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక క్లస్టర్‌ను Two-Way కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా నేరుగా అనుసంధానిస్తూ నాయకులు, కార్యకర్తలతో మమేకం కానున్నారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రతి క్లస్టర్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.


మహిళల భాగస్వామ్యంపై చర్చలు..

ఈ ఏడాది మహానాడు ప్రత్యేకంగా ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, పార్టీ నిర్మాణంలో మహిళల పాత్ర, సామాజిక సేవలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా ‘కార్యకర్తే అధినేత, యువగళం, పేదల సేవలో టీడీపీ’ వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరుగనున్నాయి. మహానాడులో మొత్తం 10 కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇప్పటికే మహానాడు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ శ్రేణులు, పసుపు జెండాలతో కేంద్ర కార్యాలయాన్ని అలంకరించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలను పార్టీ శ్రేణులు ‘పసుపు పండుగ’గా అభివర్ణిస్తున్నాయి.


రాబోయే రాజకీయ వ్యూహాలపై దిశానిర్దేశం..

ఉదయం 10:40 గంటలకు చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనున్నారు. అనంతరం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రసంగించనున్నారు. రాబోయే రాజకీయ వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం, యువత, మహిళల పాత్రపై కీలక సందేశాలు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహానాడు-2026 ద్వారా పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడంతో పాటు, గ్రామస్థాయి కార్యకర్తలతో ప్రత్యక్ష అనుసంధానం పెంచడంపై టీడీపీ హై కమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక చర్చ

కరెంట్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి గొట్టిపాటి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 27 , 2026 | 10:10 AM